జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ నాయకత్వంలో ప్రకాశం జిల్లా పోలీసులు సమర్థంగా పని చేస్తున్నారనే చెప్పాలి. రోజూ ఏదో ఒక కేసులో బ్రేక్ త్రూ సాధించటం, ప్రెస్మీట్లు పెట్టడం జరుగుతోంది. ఈ మధ్యకాలంలో ప్రకాశం జిల్లా పోలీసులు అనేక క్లిష్టమైన కేసులు పరిష్కరించారు.
అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్నారు. రేషన్ బియ్యం మాఫియా మీద ఉక్కుపాదం మోపారు. గుట్కా కింగులను లోపలేశారు.మిస్టరీగా మిగిలిన హత్య కేసులను ఛేదించారు. అయితే వారి శక్తిసామర్థ్యాలకు జిల్లాలో జరిగిన రెండు కిడ్నాప్ లు సవాల్ విసురుతున్నాయి.ఇటీవలే ఒకేరోజు పొదిలి ప్రాంతంలో నలుగురు బాలికలు అదృశ్యం కాగా గంటల వ్యవధిలో పట్టుకోగలిగిన పోలీసులు ఈ రెండు కిడ్నాపుల విషయంలో మాత్రం పురోగతి సాధించలేకపోవటం వారి ప్రతిభా పాటవాలను శంకించే విధంగా ఉంది.దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం రెడ్డి నగర్ గ్రామానికి చెందిన రెండు సంవత్సరాల బాలుడు మేడం ఆరుష్ రెడ్డి గత ఏడాది జూన్ ఇరవై నాలుగు వ తేదీన ఇంటి బయట ఆడుకుంటుండగా కొందరు కారులో వచ్చి అతడిని అపహరించుకుపోయారు.ఇది జరిగి దాదాపు ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటివరకు ఆరుష్ రెడ్డి జాడ తెలియరాలేదు.ఇదే విషయమై ఆ బాలుడి తల్లిదండ్రులు నేరుగా ముఖ్యమంత్రి జగన్ కి కూడా వినతిపత్రం సమర్పించారు. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉంది.ఇక పర్చూరు నియోజకవర్గం చినగంజాం లో ఆరు సంవత్సరాల బాలిక కత్తి లక్ష్మి కూడా కిడ్నాప్ కి గురైంది.
ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై అయిదవ తేదీన కత్తి లక్ష్మి చినగంజాం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉండగా ఒక వ్యక్తి వచ్చి తన కుమార్తెను తీసుకొని సైకిల్పై వెళ్లిపోయాడని సహ విద్యార్థులు టీచర్లు చెప్పినట్లు బాలిక తండ్రి నాంచారయ్య చినగంజాం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు కానీ ఆ బాలిక జాడ కనిపెట్టలేకపోయారు.ఈ నేపథ్యంలో వీళ్లిద్దరూ ఎక్కడున్నారు? ఏమయ్యారు అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న! గతంలో కూడా ఒంగోలులో కళా చౌదరి అనే విద్యార్థిని అదృశ్యం అయిపోయింది. ఇప్పటివరకు ఆమె జాడ తెలియరాలేదు.ఆరుష్రెడ్డి కత్తి లక్ష్మిల కిడ్నాప్ కేసులు కూడా అదే జాబితాలో చేరుతాయోమోనన్న సందేహాలు కలుగుతున్నాయి .డైనమిక్ ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఈ రెండు కేసులను ఛాలెంజ్ గా తీసుకోవాలని ప్రకాశం జిల్లా ప్రజానీకం కోరుతోంది.