Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత ఎట్టకేలకు తన ఓటమిని ఒప్పుకున్నారు. మూడవ దశ పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు Chandrababu ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం లోని 89 పంచాయతీల్లో ఏకంగా 74 పంచాయతీలను అధికార పార్టీ చేజిక్కించుకోవడం తో పాటు టీడీపీకి అక్కడ కేవలం 14 స్థానాలు లభించాయి. దీనిపై గురువారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు తన ఓటమిని ఒప్పుకున్నారు. అయితే…. ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వం మీద, వైసిపి మీద చేసిన కొన్ని ఆరోపణలు అంత సహేతుకంగా అనిపించలేదు. ఓటమి నిజాయితీగా నిబ్బరంగా ఒప్పుకోవాల్సిన చంద్రబాబు వైఎస్ఆర్సిపి మీద పూర్తిగా ఆరోపణలు చేసి తప్పించుకోవాలని కోవడం ఆయన 40 ఏళ్ల రాజకీయానికి సరిపడలేదన్నది రాజకీయ విశ్లేషకుల మాట.
ఆయన ఆరోపించిన కొన్ని అంశాలు…
1. కుప్పంలో ఓడిపోయింది చంద్రబాబు కాదు ప్రజాస్వామ్యం ఓడిపోయింది…
—————————————
గెలిస్తే చంద్రబాబు గెలుపు గా… ఓడితే ప్రజాస్వామ్యం ఓడిపోయిందని వ్యాఖ్యలు చేయడం చంద్రబాబు జెంటిల్మెన్ తరహా రాజకీయాలకు విరుద్ధం. ఓటమిని నిజాయితీగా ఒప్పుకోవాలి. దానిమీద సమీక్షించుకోవాలి. తప్పులు ఎక్కడ జరిగాయో వాటిని సరిదిద్దుకోవాలి. అంతే తప్ప గెలిచినప్పుడు మన గెలుపు గా ఓడినప్పుడు వ్యవస్థల ఓటమిగా చెప్పుకోవడం 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన టీడీపీ అధినేత కు చెల్లుబాటు కాదు. ఇటీవల విశాఖలో సైతం ఆయన పోలీసు శాఖ మీద చేసిన కొన్ని వ్యాఖ్యలు పరిశీలిస్తే వ్యవస్థల మీద ఆయన ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నారు అనేది అర్ధం కావడం లేదు.
2. పంచాయితీ ఎన్నికల్లో కుప్పంలో గెలవడానికి వైసిపి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది.
————————————
పంచాయతీ ఎన్నికల కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, విజయాలను కొనుగోలు చేయాల్సిన అవసరం ప్రస్తుతం అధికార పార్టీకి లేదు. అందులోనూ రాష్ట్ర ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలు కె ప్రాధాన్యత ఇవ్వడంతో ఎలాంటి అభివృద్ధి పనులు జరగక … నాయకుల వద్ద కూడబెట్టుకునే ఛాన్స్ లేక మదన పడుతున్నారు. అందులోనూ ఇది పార్టీకి సంబంధించిన ఎన్నికల్లో లేక చంద్రబాబు ను ఓడించడానికి జరుగుతున్న ఎన్నికల్లో కాదు. మరి అలాంటప్పుడు వైసిపి నాయకులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది..? అన్ని కోట్ల రూపాయలు ఉన్న నాయకులు పంచాయితీ ఎన్నికల్లో ఎందుకు నిలబడతారు.
3. కుప్పం ప్రజలు నన్ను కుటుంబ సభ్యుల ఆదరిస్తారు..
———————————
ఒక రాజకీయ నాయకుడిని నియోజకవర్గ ప్రజలు తన వాడు అని అనుకోవాలి అంటే ఎంతో పనిచేయాలి. ప్రజల మధ్యలో ఎల్లప్పుడూ కనిపించాలి. వారికి ఎలాంటి కష్టం వచ్చినా ముందుండి సాయం చేయాలి. చంద్రబాబు గత రెండు దశాబ్దాలుగా కుప్పం వచ్చింది చాలా తక్కువ. హైదరాబాద్ కు ఎక్కువ పరిమితమైన ఆయన కుప్పం నియోజకవర్గంలో కేవలం కొందరు నాయకులకు ప్రాతినిధ్యం అప్పగించి, కార్యకర్తల బలం తో బండి లాగిస్తున్నారు. మరి అలాంటప్పుడు కుప్పం ప్రజలకు చంద్రబాబు మీద ఆపేక్ష ఎలా ఉంటుంది. ఆయనను కుటుంబ సభ్యుడిగా ఎప్పుడూ కుప్పం ప్రజలు ఆదరించారు..??
40 ఏళ్ల పైబడి రాజకీయాల్లో తలపండిన చంద్రబాబు తన ఓటమిని ఒప్పుకునే విషయం లో టీడీపీ కేడర్ ఆత్మధైర్యం దెబ్బతింటుంది అనే కోణాన్ని ఆలోచించినట్లు ఉన్నారు. అందుకే సూటిగా సుత్తి లేకుండా తన ఓటమిని అంగీకరించి లేక రకరకాల సాకులు చెప్పడం ఆయన పెద్దరికానికి చిన్నతనం తీసుకు వచ్చినట్లు అయింది.