AP Panchayat Elections : పంచాయతీ పోరులో అసలు గెలుపెవరిది?ఓటమెవరిది?పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలే అయినా.. తమదంటే తమదే విజయం అంటూ అధికార, విపక్ష పార్టీలు సవాళ్లు విసురుకుంటున్నాయి.
ఊరికి మొనగాళ్లం తామే అంటూ జబ్బలు చరుచుకుంటున్నాయి.పంచాయతీ ఫైట్లో తమ మద్దతుదారులే ప్రభంజనం సృష్టిస్తున్నారని అధికార వైసీపీ చెబుతోంది. మొదటి దశ కంటే రెండో దశలో మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించామని తెలిపింది. రెండోదశలో 3328 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే.. తాము 2280 స్థానాలను కైవసం చేసుకున్నామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.టీడీపీ కూడా తామేం తక్కువ కాదన్నట్టుగా మాట్లాడుతోంది. రెండో విడత ఎన్నికల్లో తమ మద్దతు దారులు 40 శాతం మంది గెలిచారని అంటోంది. 600కుపైగా సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నామని ఇంకా తుదిఫలితాలను చూస్తే ఆ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని చెబుతోంది. ఈ ఫలితాలు సర్కారుకు గుణపాఠమని టీడీపీ ఎదురుదాడికి దిగుతోంది.
AP Panchayat Elections : గెలుపు మాదంటే మాదే!
పల్లె ప్రజలు ఇస్తున్న తీర్పును ఎవరికి వారు అనుకూలంగా మల్చుకునే యత్నం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు, పాలనపై సంతృప్తితో పల్లెజనం వైసీపీ అభిమానులకు బ్రహ్మరథం పడుతున్నారని ఆ పార్టీ అంటుండగా… సర్కార్ పాలనకు వ్యతిరేకంగా పంచాయతీ ఫలితాలు అద్దం పడుతున్నాయని టీడీపీ చెప్పేయత్నం చేస్తోంది.ఈ నేపథ్యంలో ఒకరిని మించి ఒకరు సంబరాల్లో మునిగిపోతున్నారు. పల్లెపోరులో తమ జెండా ఎగిరిందంటే తమ జెండానే ఎగిరిందంటూ బాణాసంచాలను కాల్చుతున్నారు. స్వీట్లు పంచుకుంటున్నారు. పోటాపోటీగా వైసీపీ, టీడీపీ నేతలు సంబరాల్లో పాల్గొంటూ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు.