వైఎస్ జగన్ ప్రతీకార జ్వాలల్లో ఇప్పుడు జేసీ ఫ్యామిలీ తగలబడుతోందేనే గుసగుసలు జిల్లాలో వినిపిస్తున్నాయి.. అందుకే జేసీబ్రదర్స్ మౌనం దాలుస్తున్నారన్న ప్రచారం అనంతపురం జిల్లాలో ఉధృతంగా సాగుతోంది.
వైఎస్ జగన్ ప్రభుత్వం వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ మాజీ ఎంపీ టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి నోరు మెదపక పోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరతీసింది.
జేసీ దివాకర్ రెడ్డి.. ఏ పార్టీలో ఉన్నా.. సొంత పార్టీ నేతలపై.. ప్రత్యర్థులపై కుండబద్దలు కొట్టినట్టు వాస్తవాలను మాట్లాడే వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. ఇన్నాళ్లు జేసీ నోటి నుంచి ఎన్నో ఆణిముత్యాలు జాలువారాయి.. మీడియాలో హైలెట్ అయ్యాయి. అన్ని రోజులు అలానే సాగాయి. పార్టీలను వారి అవసరాలకు అనుగుణంగా జేసీ మాటలు మార్చేస్తుంటారు. కాని ఈ ఎన్నికల ఫలితాలు జేసీ పూర్తి దృష్టాంతాన్ని మార్చేశాయి.
అనంతపురం లోక్సభ తాడిపత్రి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు జెసి కుటుంబం ఇమేజ్కి పెద్ద దెబ్బ తగిలింది. వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై అర్థరహితంగా.. పగతో బండ బూతులు మాట్లాడిన జేసీ సోదరులు ఇద్దరూ ఇప్పుడు ఆ జిల్లాలో బలహీనపడ్డారు. అయితే.. జెసి దివాకర్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మొదట్లో ఎటువంటి మార్పు లేదని చెప్పాలి. సంవత్సరం వరకూ కూడా ఆయన అదే ధీమాగా ఉన్నారు. తన స్టైల్ తనదేనని తొడగొడుతూ అదే ధైర్యంతో ప్రవర్తించాడు. తన పద్ధతిలో మాట్లాడాడు.జగను రెడ్డిపై అవాంఛిత వ్యంగ్య మాటలు మాట్లాడుతూనే ఉన్నాడు.జేసీ ట్రావెల్స్ బస్సుల అక్రమాల్లో తన కుమారుడు అస్మిత్ అరెస్ట్ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి కాస్త మారిపోయారు. లోకేశ్ కూడా అతనిని ఓదార్చడానికి వెళ్ళాడు. ఈ సీమ పౌరుష బిడ్డలకు ఇంతవరకు ఓదార్పు అంటే ఏమిటో వారికి తెలియదు.. ఈ సానుభూతి పిక్స్ వైరల్ కూడా అయ్యాయి.
జెసి దివాకర్ రెడ్డి కూడా ఆ సమయంలో దూకుడుగా మాట్లాడలేదు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి విషయంలో ఆయన మౌనం దాల్చారు. ఇదివరకే తన తమ్ముడు మాట్లాడిన మాటలకు జగన్ హర్ట్ అవడంతో పరిస్థితులు ఎంతవరకు వచ్చాయని జేసీకి అర్థం అయిందంటున్నారు.అందుకే అన్నదమ్ములిద్దరూ సైలెంట్ అయి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కాలం కలిసి రాకపోతే ఇలాగే ఉంటుంది మరి!