The ancestral gods : పితృదేవతలు
అస్సలు పితృ దేవతలు అంటే ఎవరు చనిపోయిన మన పెద్దలేనా ? ఈ సందేహం చాలా మందికి ఉంటుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాలిసింది ఏవిటంటే పితృదేవతలు అంటే చనిపోయిన మన పెద్దలు కాదు. మనందరి రాకపోకలను, పొందవలసిన గతులను సమర్థవంతంగా నిర్వహించే దేవతా వ్యవస్థనే పితృదేవతలు అని అంటారు. వసువులు మరియు రుద్రులు తో పాటు ఆదిత్యులు ఈ దేవతలను పితృదేవతలు అని అంటారు.ఈ పితృ దేవతలే మనం మన పెద్దలకు పెట్టె పిండాలను వారికీ అందే విధం గా చేసి మన గతులను నిర్ణయిస్తారు.
ఒక వ్యవస్థ ఏర్పాటు
కర్మ సంపూర్ణం గా క్షయం కాని జీవుడు మరణం తరువాత మరల జన్మిస్తాడు అనేది వాస్తవం. ఆ జన్మ వెంటనే వస్తుంది అని మాత్రం చెప్పలేము. ఒక లెక్క ప్రకారం చెప్పాలి అంటే జీవుడు మరణించిన తర్వాత మరొక జన్మ తీసుకోవడానికి 300 సంవత్సరాలు వరకు పడుతుంది.కొన్ని కొన్ని సార్లు వెంటనే జన్మించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ లెక్క అనేది ఆ జీవుని యొక్క సంకల్ప బలం తో పాటు తనకి గల ప్రారబ్ధ కర్మ , ఆగామి, తో పాటు సంచితం అనే కర్మల మీద కూడా ఆధార పడి ఉంటుంది.మన కుటుంబం లో చనిపోయిన వారు వెంటనే జన్మించిన కూడా మనం చేసే పితృకర్మలు ఫలితం వారికీ దక్కుతుంది. వారు ఏ రూపంలో పుట్టిన కూడా మనం పెట్టినది వారికి ఏది ఆహారంగా ఉండాలో ఆ రూపంలో అందుతుంది. ఇలా అందేలా చేయడానికి పితృదేవతలు ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు. అంటే ఉదాహరణ గా చెప్పాలంటే మరణించిన వ్యక్తి యొక్క ఆ జీవుడు ఆవుగా పుడితే గడ్డి మొదలైన రూపంలో మనం పెట్టిన ఆహారం మారి వారికి అందుతుంది. వారికోసం అలా చేసినందుకు పితృదేవతలు కూడా సంతోషించి మనకి మంచి మంచి జరిగేలా చేస్తారు. ఒకవేళ మరణించిన వారు ముక్తిని పొంది లేదా ఉత్తమ గతులు పొందడం వలన మనం చేసినవి అవసరం లేకపోతే మాత్రం మనం చేసిన పితృకర్మలు ఫలితం మనకు కోరికలు తీరే విధంగా ఉపయోగపడుతుంది.
అదేవిధం గా మన పెద్దలు పుణ్యం వలన దేవలోకంలో దేవతలుగా ఉండి ఉంటే శ్రాద్ధకాలంలో ఇచ్చిన పిండాదులు అమృతరూపంగా మారి వారికి చేరుతుంది. అదే మళ్ళీ మనిషిగానే పుడితే అన్నరూపంగా వారికి అంది తృప్తినిస్తుంది. పశుపక్ష్యాది గా జన్మ తీసుకుంటే గడ్డి మొదలైన ఆహార రూపంలో మారి తృప్తిని ఇస్తాయి. కాబట్టి కచ్చితం గా మన పితరుల పిండాలు పెట్టడం మంచిది. ఇక జన్మంటూ లేక జీవన్ముక్తి పొందినవారికి తప్ప మిగతా వారికి మరణం తరువాత కూడా తన పూర్వీకుల తో, తన తరువాతి తరం తోనూ సంబంధం వుండి మనం వారి కోసం పెట్టే ఆహారం తీసుకుంటారు.