ఆగస్టు 5న అయోధ్యలో జరగనున్న రామ మందిర నిర్మాణ భూమిపూజకు గాను ఇక్బాల్ అన్సారి అనే వ్యక్తికి తొలి ఆహ్వానం అందజేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆహ్వానాన్ని అందుకున్న ఇక్బాల్ తాను భూమి పూజకు హాజరవుతానని తెలిపాడు. దీంతో ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అయితే అసలు ఇంతకీ ఇక్బాల్ ఎవరు ? అతని కథేంటి..? అనే వివరాలను పరిశీలిస్తే..
1952లో హిందూ వర్గీయులు అయోధ్యలో ఉన్న మసీదును ఆక్రమించారని హషీం అన్సారి అనే వ్యక్తితోపాటు మరో 5 మంది ముస్లింలు ఫైజాబాద్ సివిల్ కోర్టులో కేసు పెట్టారు. దీంతో అప్పటి నుంచి అయోధ్య స్థలంపై కోర్టులో వివాదం నడుస్తోంది. కాగా ఆ హషీం అన్సారి కుమారుడే ఇక్బాల్ అన్సారి. హషీం 2016లో చనిపోయాడు. అంతకన్నా ముందే ఆ స్థలం విషయమై కేసు పెట్టిన ఆ 5 మంది కూడా చనిపోయారు. దీంతో వారి వారసులు కేసును ముందుకు నడించారు. అలా హషీం కుమారుడు ఇక్బాల్ కూడా ఇతరులతో కలిసి కేసు విషయమై పోరాడాడు. కానీ చివరకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అందజేసిన వివరాల ప్రకారం.. అన్ని అంశాలను పరిశీలించిన సుప్రీం కోర్టు హిందూ వర్గానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
అయితే అయోధ్య రామ మందరి నిర్మాణ భూమి పూజకు తొలి ఆహ్వానం అందుకున్న ఇక్బాల్ అన్సారి మాత్రం.. బహుశా ఇది రాముడి సంకల్పం అయి ఉండవచ్చు.. కనుక పూజకు కచ్చితంగా హాజరవుతానని తెలిపాడు. ఆగస్టు 5న మోదీ రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. ఆ కార్యక్రమానికి 150 మంది వరకు హాజరవుతారని తెలుస్తోంది.