TTDP: తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడు ఎవరవుతారన్న విషయమై పలు ఊహాగానాలు సాగుతున్నాయి.ఇప్పటివరకు టిటిడిపి చీఫ్ గా ఉన్న ఎల్ .రమణ సైకిల్ దిగి కారెక్కిన విషయం తెలిసిందే.తెలుగుదేశం పార్టీని జాతీయపార్టీగా చేసినప్పటి నుండి రమణే తెలంగాణ లో పార్టీ సారధిగా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ముందుగా కళా వెంకట్రావుకి ఈ పదవిచ్చారు.ఈమధ్యే ఆయన స్థానంలో అచ్చెన్నాయుడు అందలం ఎక్కారు.కారణాలేవైనప్పటికీ రమణను చంద్రబాబు గట్టిగా నమ్మారు.రెండోసారి ఆయనకు రెన్యువల్ చాలామంది వద్దన్నప్పటికీ ఇక చంద్రబాబు వినకుండా రమణనే పార్టీ చీఫ్ గా కొనసాగించారు.అలాంటి రమణ ఇప్పుడు పార్టీని వీడారు.దీంతో కొత్త అధ్యక్షుడి నియామకం అనివార్యమైంది.ఇప్పటికే చంద్రబాబు ఈ కసరత్తు ప్రారంభించారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.
డైలమాలో చంద్రబాబు!
ఈసారి టీడీపీ అధ్యక్ష పదవిని బీసీలకే ఇవ్వాలా రెడ్ల కి ఇవ్వాలా అన్న విషయంలో చంద్రబాబు డైలమాలో ఉన్నట్టు సమాచారం.గత ఏడు సంవత్సరాలుగా బిసి అయిన రమణ పార్టీ అధ్యక్షులుగా కొనసాగారు.ఆయన నిష్క్రమణ అనంతరం తిరిగి బీసీలకే ఆ పదవి ఇస్తే వారిని గౌరవించినట్లు ఉంటుందన్నది,తద్వారా వారిని ఆకట్టుకోవచ్చన్నది చంద్రబాబు యోచనగా కనిపిస్తోంది.అయితే ప్రస్తుతం తెలంగాణలో రెడ్ల హవా ను కూడా చంద్రబాబు పరిగణనలోకి తీసుకున్నారని అంటున్నారు.టీ పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి,బిజెపి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈ మధ్యే సొంత పార్టీ పెట్టిన వైఎస్ షర్మిలా రెడ్డి తదితరులను చూశాక టిడిపి తెలంగాణ పగ్గాలను కూడా రెడ్లకే ఇస్తే ఎలా ఉంటుందన్న విషయమై కూడా చంద్రబాబు మేధోమథనం చేస్తున్నారట.
అరవింద్ గౌడ్ లేదా రావుల చంద్రశేఖరరెడ్డి లలో ఒకరికి ఛాన్స్?
బీసీలకు గనుక ఈ పదవి ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయితే అది అరవింద్ గౌడ్ కు దక్కే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఒకప్పుడు టిడిపిలో చక్రం తిప్పిన మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్ సమీప బంధువైన అరవింద్ గౌడ్ టిడిపికి విశేషమైన సేవలు అందించిన మాట వాస్తవం.ఆయనకు ఇప్పటివరకు పార్టీలో సరైన ప్రాధాన్యం లభించలేదన్నది కూడా కాదనలేని మాట.పైగా ఆయన కులం టిడిపికి అదనపు బలం కాగలదని అంచనా.ఒకవేళ రెడ్ల వైపు చంద్రబాబు మొగ్గితే మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డికి ఈ పదవి దక్కుతుందంటున్నారు.రావుల చంద్రశేఖర్ రెడ్డి సీనియరే కాకుండా చంద్రబాబు నాయుడుకి చాలా సన్నిహితుడు.సబ్జెక్టు ఉన్న నాయకుడు. ఏ విధంగా చూసినా వీరిద్దరిలో ఒకరికి ఈ పదవి లభించటం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.