అద్దంకి టిడిపి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ని బాగా తెలిసిన వారు బుజ్జి అంటారు. ఇప్పుడు ఆయనను వాడు మగాడ్రా బుజ్జి అని కీర్తిస్తున్నారు.
అధికార వైసీపీలో చేరాలని ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు వచ్చినప్పటికీ గొట్టిపాటి రవికుమార్ ఏమాత్రం అదరక బెదరక టిడిపిలోనే కొనసాగటంతో ఆయన గ్రానైట్ లీజులను ప్రభుత్వం ఏకంగా రద్దు చేసేసిన విషయం తెలిసిందే.నిజానికి ప్రకాశం జిల్లాలో గ్రానైట్ రాయల్టీలు ప్రభుత్వానికి ఎగ్గొట్టిన వ్యవహారంలో దాదాపు నలభై మందికి ప్రభుత్వం జరిమానాలు విధించింది. దాదాపు 2100 కోట్ల రూపాయల మేర ఆయా కంపెనీలకు ప్రభుత్వం ఫైన్ వేయగా పలువురు గ్రానైట్ వ్యాపారులు కం రాజకీయ నాయకులు టిడిపి జెండా పీకేసి వైసిపి పంచనచేరి పోయారు.
జిల్లాలో గ్రానైట్ కింగ్గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు చీరాల టిడిపి ఎమ్మెల్యే కరణం బలరామ్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.అయితే అది నుండి తనను వైసిపి వెంటాడుతున్నప్పటికీ రవికుమార్ ఏ మాత్రం అదరలేదు బెదరలేదు. కాంగ్రెస్ పక్షాన 2004లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన గొట్టిపాటి రవికుమార్ ముందు మార్టూరులో గెలుపొందారు.2009 లో ఆ నియోజకవర్గం రద్దుకావడంతో అద్దంకి వెళ్లి అక్కడా గెలిచారు.2014 లో వైసీపీ పక్షాన అద్దంకి లోనే విజయం సాధించారు. అయితే మధ్యలో ఆయన టిడిపి తీర్థం తీసుకున్నారు.
2019 లో రవికుమార్ అద్దంకిలో టిడిపి అభ్యర్థి గా విజయం సాధించారు.అయితే వైసీపీ కన్ను మొదటి నుంచి రవికుమార్ మీద ఉంది .నయానా భయానా చెప్పి చూసి ఆయన్ను వైసీపీలోకి రప్పించడానికి పావులు కదిపారు.కానీ రవికుమార్ నుండి సానుకూల స్పందన రాకపోవడంతో జగన్ ప్రభుత్వం తన పని తాను చేసుకుపోయింది.తమ మాట వినకుండా పార్టీలో చేరకపోవడంతో ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగింది.
ఆయనను ఆర్థికంగా నష్టపర్చే ఎత్తులు వేసింది. ఆయనను ఆర్థికంగా కట్టడి చేయాలన్నది వైసీపీ నేతల యత్నంగా కన్పిస్తుంది.అయితే రవికుమార్ తన గ్రానైట్ లీజుల రద్దుపై న్యాయపోరాటం చేయడానికి నిర్ణయించుకున్నారని ఎట్టి పరిస్థితుల్లో ఆయన వైసిపికి లొంగిపోయే ప్రసక్తే లేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం మరికొన్ని ఆసక్తికర మలుపులు తిరిగే సూచనలు గోచరిస్తున్నాయి!