జనసేనాని పవన్ కల్యాణ్ అవలంభిస్తున్న నిలకడలేని రాజకీయాలకారణంగా నిండా మునిగిపోతామని ఆ పార్టీ అగ్ర నాయకులే లోలోన ఆందోళన చెందుతున్నారు.పవన్ కళ్యాణ్ తర్వాత జనసేనలో రెండో స్థానంలో ఉన్న మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా ఇదే విషయమై తీవ్రంగా మధన పడుతున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ పార్టీ నాయకులు పలువురు జనసేనను వీడారు.విశాఖపట్నం నుండి లోక్సభకు పోటీ చేసిన మాజీ జేడి లక్ష్మీనారాయణ కూడా నిష్క్రమించారు.ఆయన వెళుతూ వెళుతూ పవన్ కల్యాణ్కు సినిమాలున్నాయి ఆయన పూర్తికాలం రాజకీయాల కోసం వెచ్చించలేరన్న బండరాయిని కూడా విసిరారు.అయితే ఆశ్చర్యంగా ఇప్పుడు జరుగుతోంది అదే.సినిమాల మీద పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది.
జనసేన విషయంలో ఆయన ఎప్పుడు ఏ విధమైన లైన్ తీసుకుంటారో ఎవరికీ అర్థం కావడం లేదు.ముఖ్యంగా రాజధానిగా అమరావతి కొనసాగింపు విషయంలో పవన్ కల్యాణ్ రెండు నాల్కల ధోరణి జనసేనకు చెందిన కోస్తా నాయకుల కొంప ముంచేది గా ఉంది.ఈ సెగ అందరికంటే ముందుగా ఎక్కువగా తగిలేది మనోహర్ కే.దీంతో ఆయన తీవ్రంగా తన రాజకీయ భవిష్యత్తు పై తర్జన భర్జన పడుతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్పాయి.
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు కుమారుడైన మనోహర్ విద్యాధికుడు.రాజకీయాల్లోకి రాగానే తెనాలి నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి స్పీకర్ కూడా అయ్యారు.మంచి పేరు తెచ్చుకున్నారు .మరక లేమీ లేవు.అయితే రాష్ట్ర విభజన నేపద్యంలో 2014 తరువాత కాంగ్రెస్ కనుమరుగు కావడంతో ఆయన అనూహ్యంగా జనసేన వైపు తిరిగారు.
మొన్నటి ఎన్నికల్లో జనసేన పక్షాన తెనాలి లో పోటీ చేసి ఓడిపోయారు .ప్రస్తుతం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడిగా ప్రాధాన్యత ఉన్న పదవిలోనే మనోహర్ ఉన్నప్పటికీ పార్టీ అధినేత పోకడల వల్ల ఆయనకు 2024లో కూడా ఎసరు తప్పదంటున్నారు.అమరావతి రాజధానికి తెనాలి పక్కనే ఉంటుంది.ఒకవేళ పవన్ కనుక అమరావతి విషయంలో కప్పదాటు వైఖరి అవలంబిస్తే
ఆ ఎఫెక్టు మనోహరు మీద పడటం ఖాయమంటున్నారు.ఎవరైనా చెబితే వినే మనస్తత్వం కూడా లేని పవన్ కల్యాణ్తో ఎలా వేగాలా అని మనోహర్ తల పట్టుకు కూర్చున్నాడని కూడా సమాచారం.తండ్రి భాస్కరరావు బీజేపీలో ఉన్నారు.అనివార్యమైతే మనోహరు ఆ వైపు చూసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు వూహిస్తున్నారు.