ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉండాల్సిందే! అవసరమైన అన్ని విషయాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందే! ఈ పాత్రను ప్రతిపక్షం ఎంత బలంగా పోషిస్తుందో అంత ప్రజలకు దగ్గరవుతుంది! కానీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు భిన్నంగా మారాయి.
రెండు పార్టీలు ఒకేలా మారాయి. బురద పూసుకుంటున్నాయ్. తెలుగుదేశం పార్టీ రాజకీయం చూస్తే తాను ప్రతిపక్షం కాబట్టి జగన్ ప్రభుత్వాన్ని విమర్శించాల్సిందే అన్నట్టుగా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే టిడిపి బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర కాకుండా ప్రభుత్వంపై బురదజల్లే భూమిక పోషిస్తోంది. మరోవైపు అధికార పార్టీ కూడా చీటికీమాటికీ ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తుంది. తమ పాలనా లోపాలు కూడా ప్రతీది టీడీపీపైకి నెట్టేస్తుంది. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా ప్రతిపక్షం ప్రభుత్వానికి… ప్రభుత్వం ప్రతిపక్షానికి ముడిపెడుతూ ఏదో ఒక ప్రకటన చెయ్యడం, సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టడం పరిపాటిగా మారింది .వీటన్నింటిని గుడ్డిగా ప్రజలు నమ్మేసి తననేదో ఆదరిస్తారని రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఇక తాజా అంశానికి వస్తే..! నంద్యాల సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో టీడీపీ బొక్కబోర్లా పడింది. ప్రభుత్వంపైకి నెట్టేయబోయి బాబు తరహా రాజకీయం బయటకొచ్చింది.
నంద్యాలలో ఈ మధ్యనే అబ్దుల్ సలామ్ అనే ఆటోడ్రైవర్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వేధింపుల కారణంగానే తాము బలవన్మరణానికి పాల్పడుతున్నామని సలాం ఆత్మహత్య చేసుకునే ముందు ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఒక సీఐ ,మరో కానిస్టేబుల్ను అరెస్టు చేయించింది. అయితే వారికి పక్క రోజే బెయిల్ దొరికింది. దీంతో టిడిపి ప్రత్యేకించి చంద్రబాబు రెచ్చిపోయారు. పోలీసులను అరెస్టు చేసినట్లే చేసి ఇలా బెయిల్ ఇచ్చేశారంటూ పెదబాబు, చినబాబు టిడిపి అనుకూల మీడియా సోషల్ మీడియా గగ్గోలు పెట్టింది. అరెస్టు చేయించటం వరకూ ప్రభుత్వ బాధ్యత. బెయిల్ ఇచ్చేది న్యాయమూర్తి నిర్ణయం.
ఇందులో ప్రభుత్వ పాత్ర ఉండదన్నది అందరికీ తెలిసిన విషయం. అయినా చంద్రబాబు బృందం జగన్ ప్రభుత్వంపై టన్నులకొద్దీ బురద జల్లగా అసలేం జరిగిందని సర్కార్ ఆరా తీస్తే నివ్వెరపోయే నిజం బయటకు వచ్చింది. టిడిపి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న నంద్యాలకు చెందిన న్యాయవాది వెదురు రామచందర్రావు ఆ పోలీసులు ఇద్దరికి బెయిల్ ఇప్పించి బయటకు తెచ్చారని వెల్లడైంది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గా ఉన్న ఆయన పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఇదే విషయాన్ని సీఎం జగన్ ఒక సభలో బహిర్గతపరచడంతో చంద్రబాబు, ఇతర టిడిపి నేతల వాయిస్ పడిపోయింది. ఆ తర్వాత నుండి సలాం విషయంలో టిడిపి నుండి ఎటువంటి స్పందన లేకపోవడం ఇక్కడ గమనార్హం. ఎంతో అనుభవం ఉన్న రాజకీయ దిగ్గజం చంద్రబాబు ఏ విషయాన్నైనా తనకు అనుకూలంగా మలుచుకునే నేర్పరి!