టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి మనకి విదితమే. దాదాపుగా రెండు సంవత్సరాలు తరువాత రానున్న ఈ సినిమా పై మెగా అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నట్లు తెలుస్తుంది. చిరు సైరా నరసింహా రెడ్డి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన తర్వాత చిరంజీవి నటిస్తోన్న సినిమా కావడంతో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా తరువాత చిరు వరుసగా చాలా సినిమాలను ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే మలయాళం సినిమా ‘లూసీఫర్’ తెలుగు రీమేక్ షూటింగ్ పట్టాలెక్కింది. ఇటీవల ఈ చిత్ర బృందం ఈ సినిమా ప్రారంభోత్సవం చేసిన ఫోటోలు సోషల్ మీడియా లో హల్చల్ చేశాయి. అలాగే ఈ సినిమా తర్వాత చిరంజీవి, హీరో అజిత్ నటించిన వేదాళం సినిమాలో కనిపించబోతున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వేదాళం కోలీవుడ్ లో మాస్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాని టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ల రికార్డులు కలిగిన డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. మరి అలాంటి దర్శకుడితో చిరు సినిమాకి ఎలా ఒప్పుకున్నారు అంటూ టాలీవుడ్ వర్గాలు తెగ ఆలోచిస్తున్నాయి.
గతంలో మెహర్ రమేష్ తీసిన ఒకేఒక్క సినిమా వెంకటేష్ హీరోగా నటించిన ‘షాడో’. ఆ సినిమా రిలీజ్ అయ్యాక మళ్లీ మెహర్ రమేష్ ఒక్క సినిమా కూడా తెరకెక్కించలేదు. ఇన్ని రోజులు తనతో సినిమా చేస్తా అని చెప్పి ఇప్పుడు చిరు హ్యాండ్ ఇచ్చాడని `టాలీవుడ్ వర్గాలనుంచి సమాచారం అందుతుంది. వేదాళం సినిమాలో చాలా హెవీ ఫైట్స్ తో పాటు డ్యాన్స్ కూడా ఉండడంతో ఈ వయస్సులో తాను అంత వర్కవుట్లు చేయలేనని డైరెక్టర్ కు సింపుల్ గా చెప్పేశాడట చిరు.