Krishnapatnam Medicine: వేలాది మంది కరోనా రోగులకు స్వస్థత చేకూరుస్తున్న నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకి చెందిన ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య రూపొందించిన మందు మీద అకస్మాత్తుగా జిల్లా అధికారుల దృష్టి పడ్డానికి వెనుక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.గత నెల రోజులుగా ఆనందయ్యఈ మందు ఇస్తుండగా దాదాపు ఇరవై వేల మంది దాన్ని తీసుకున్నారు.
ఏ ఒక్కరూ కూడా ఆ మందు పనిచేయలేదని కానీ వికటించిందని గానీ ఫిర్యాదు చేసిన దాఖలాలు కూడా లేవు.అయితే మూడు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త ఈ మందు విషయంలో స్పందించారు.కృష్ణపట్నం మందుకు సంబంధించి మీడియాలో వస్తున్న కథనాలను ఆయన పరిశీలించిన అనంతరం నెల్లూరు జిల్లా కలెక్టర్ కి ఫోన్ చేసి మాట్లాడారు.ఆ మందు కి ఉన్న శాస్త్రీయత ఇతర అంశాల గురించి విచారించాల్సిందిగా లోకాయుక్త ఆదేశించినట్లు తెలుస్తోంది.(లోకాయుక్తకు జిల్లా కలెక్టర్ పంపిన నివేదిక లేఖ ని పరిశీలిస్తే ఈ విషయాలన్నీ స్పష్టమవుతాయి)
ఆగమేఘాల మీద విచారణ కమిటీ ఏర్పాటు!
ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆగమేఘాల మీద ఒక ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసి కృష్ణపట్నం గ్రామానికి పంపారు.డీఎంహెచ్వో డీపీఓ, ఆర్డీవోలతోపాటు ముగ్గురు ఆయుర్వేద వైద్యులను కూడా ఈ కమిటీలో సభ్యులుగా కలెక్టర్ నియమించారు.ఈ నెల పదిహేడో తేదీన కృష్ణపట్నం వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన సాగించారు.వైద్యుడు ఆనందయ్య తో మాట్లాడటమే కాకుండా ఆయన తయారు చేస్తున్న మందుల ఫార్ములాలను కూడా ఈ కమిటీ నోట్ చేసుకోంది.మందు కోసం వచ్చిన వారితో కమిటీ సభ్యులు మాట్లాడగా అందరూ సానుకూలంగానే స్పందించారు.కమిటీ సభ్యుల ముందే ఒక వ్యక్తికి ఆక్సిజన్ లెవల్స్ పడిపోగా ఈ మందిచ్చిన వెంటనే అవి పెరగడం జరిగింది.దీంతో కరోనా జాగ్రత్తలు తీసుకోమని సూచించి కమిటీ వెనుదిరిగింది.అయితే ల్యాబ్ కి పంపి పరీక్ష చేయించేంతవరకు పంపిణీని నిలిపివేశారు.
అధికారులు నివేదికలో ఏముందంటే!
అనంతరం జిల్లా కలెక్టర్ కి సమర్పించిన నివేదికలో ఆ ఆయుర్వేద వైద్యుడు అర్హతలు లేని వాడని,అతను తయారుచేస్తున్న మందులో నాణ్యతా ప్రమాణాలు లేవని కమిటీ పేర్కొంది.కానీ ప్రజల నుండి మాత్రం ఎటువంటి ఫిర్యాదులు లేవని కమిటీ స్పష్టం చేసింది.కోవిడ్ కేర్ సెంటర్లలో, ఇళ్లలో చికిత్సపొందుతున్న కరోనా రోగులకు రెండు మూడు వారాల పాటు ఇతర మందులు నిలిపివేసి ఆనందయ్య తయారుచేసిన మందులిచ్చి ప్రయోగాత్మకంగా చూద్దామని ఆ కమిటీ కలెక్టర్ కు సిఫార్సు చేసింది.ఇదే విషయాన్ని వివరిస్తూ జిల్లా కలెక్టర్ ఎపి లోకాయుక్తకు నివేదిక సమర్పించారు. అయితే రెండు రోజుల పాటు మందు పంపిణీ ఆగిపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకటం తో స్థానిక శాసనసభ్యుడు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి చొరవ తీసుకొని శుక్రవారం నుండి ఈ మందు పంపిణీకి ఏర్పాట్లు చేశారు.
లోకాయుక్త చర్యకు నిరసనలు!
ఈ మందు పంపిణీ ఆగిపోవడానికి లోకాయుక్త చర్యలే కారణం అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.గతంలో ఇంతకంటే ముఖ్యమైన చాలా విషయాల్లో ఏమాత్రం స్పందించని లోకాయుక్త ఈ మందు విషయంలో ఎందుకంతగా రియాక్ట్ అయ్యారని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని లోకాయుక్త ఈ విషయంలో స్పందించి ఉండవచ్చు ..అది జనం మంచికోసమే కావచ్చు ..కానీ ప్రస్తుతం కరోనా కారణంగా చస్తామో బతుకుతామో తెలీదన్న౦త భయాందోళనలో ఉన్న ప్రజానీకానికి నోటి దగ్గర నోటి దగ్గరకు వచ్చిన మందు పోయిందన్న ఆవేశంలో ఉన్న మాట వాస్తవం .