RRR Arrest: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తీరుపై క్షత్రియ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘురామకృష్ణంరాజు కు క్షత్రియ సేవాసమితి మద్దతు ఇవ్వడం అనేది పూర్తిగా అవాస్తవమని తేల్చిచెప్పారు. గవర్నమెంట్ కు, రఘురామకృష్ణంరాజు కు జరిగే విషయాలను పులుముకోదలుచుకోలేదన్నారు.
సోషల్ మీడియా వేదికగా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే ఎట్టిపరిస్థితుల్లో సపోర్ట్ చేయమని తేల్చిచెప్పారు. భీమవరంలో క్షత్రియ సమాఖ్య ముఖ్యనేతలు ఇవాళ భేటీ అయ్యారు. వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచి ఆపార్టీ మీదే విమర్శలు చేయడం సరికాదన్న క్షత్రియనేతలు.. ఎంపీ రఘురామ తీరును పూర్తిగా ఖండించారు. క్షత్రియులపై గౌరవంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. నర్సాపురం ఎంపీ నియోజకవర్గంలో 3 ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు ఇచ్చి గౌరవించారని చెప్పుకొచ్చారు. అరెస్ట్ అయిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు క్షత్రియ సేవాసమితి ఎలాంటి మద్దతు ఇవ్వట్లేదని స్పష్టం చేశారు. ఇది కేవలం ప్రభుత్వానికి, రఘురామకృష్ణరాజుకు సంబంధించిన వ్యవహారమని పేర్కొన్నారు. ఇందులో క్షత్రియ కులాన్ని కలపొద్దని.. తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రఘురామకృష్ణరాజు స్వలాభం, ఆస్తులు కాపాడుకోవడానికే మాట్లాడుతున్నారని క్షత్రియ నాయకులు దుయ్యబట్టారు. ఈ భేటీలో భీమవరం, పాలకొల్లు, గణపవరం, తణుకు, తాడేపల్లిగూడెం క్షత్రియ నాయకులు పాల్గొన్నారు.
లోక్సభ స్పీకర్ కి లేఖ రాస్తామన్న జనసేన!
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఏపీ ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన నేతలందరూ మూకుమ్మడిగా ఖండించారు. ఇక తాజాగా జనసేన పార్టీ కూడా రఘు రామకృష్ణ విషయంలో ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండించింది. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నరసాపురం ఎం.పి. రఘు రామకృష్ణ రాజు విషయంలో వ్యవహరించిన తీరును ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ గర్హించాలన్నారు. ప్రజలు ఎన్నుకున్న చట్టసభ సభ్యుడి పట్ల అధికారుల తీరును జనసేన పార్టీ ఖండిస్తోందని తెలిపారు. డా. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి లోబడి వ్యవహరించడం అధికారుల బాధ్యత అని.. ఒక ఎం.పి. కావచ్చు ఒక సాధారణ పౌరుడు కావచ్చు.. ఎవరి పట్లా విచారణ పేరుతో అనుచితంగా వ్యవహరించకూడదని చట్టం చెబుతోందని పేర్కొన్నారు. రఘు రామకృష్ణ రాజుకి లోక్ సభ సభ్యుడిగా ఉండే హక్కులను కాలరాసినట్లు అర్థం అవుతోంది. ఒక లోక్ సభ సభ్యుడి విషయంలోనే హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు అంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రఘు రామకృష్ణ రాజు విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును లోక్ సభ స్పీకర్ సుమోటోగా తీసుకొని విచారణకు ఆదేశించాలని జనసేన పార్టీ కోరుతుందన్నారు. బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ గా లోక్ సభ స్పీకర్ గుర్తించాలని.. ఇందుకు కారకులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకొనే విశేష అధికారం పార్లమెంటుకు ఉందని వివరించారు. ఈ అధికారాన్ని ఉపయోగించకపోతే చట్ట సభలకు ఉన్న ప్రాధాన్యత, విశిష్టతకు భంగం వాటిల్లే అవకాశం ఉందని తెలిపిన నాదేండ్ల… ఈ అంశాలపై పార్లమెంట్ సభ్యుల సహకారంతో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకి జనసేన లేఖ రాస్తుందని చెప్పుకొచ్చారు.