సీటింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో గులాబీ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
ఈ ఉపఎన్నిక బాధ్యతను మంత్రి హరీష్ రావు భుజాల కెత్తుకుని నానా హైరానా పడుతున్నారు.సాధారణంగా ఉప ఎన్నికలను అధికార పార్టీలు లైట్ తీసుకుంటాయి.ప్రభుత్వంలో ఉండే పార్టీ ఆ నియోజకవర్గానికి వరాలిచ్చి,నిధులు గుమ్మరించి ఓటర్లను తనవైపు తిప్పుకుంటుంది.కానీ దుబ్బాక రోడ్లపై ‘కారు ‘స్పీడుగా వెళ్లడం లేదట.ఈ కారణంగానే మంత్రి హరీష్ రావు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని సమాచారం.టీఆర్ఎస్ తెలంగాణలో రెండోసారి అధికారంలోకొచ్చాక జరుగుతున్న తొలి ఉప ఎన్నిక ఇదే.నిజానికి టీఆర్ఎస్కు ఉపఎన్నికలు బాగా కలిసివస్తాయి.పైగా సిటింగ్ శాసన సభ్యుడు మరణించినప్పుడు జరిగే ఉప ఎన్నికలో సానుభూతి కూడా ప్లస్ అవుతుంది.
మరి దుబ్బాక విషయంలో ఎందుకు టీఆర్ఎస్ అంత కంగారుగా ఉందన్నదే చర్చనీయాంశమైంది.దీనిపై రాజకీయ పండితులు విశ్లేషించే దేమిటంటే దుబ్బాకలో కాంగ్రెస్ కు సాలిడ్ ఓటు బ్యాంకు ఉంది.ఇక బిజెపి తెలంగాణ నాయకుడు రఘునందన్ రావు ఎప్పటినుంచో దుబ్బాకలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు.ఇక దుబ్బాకంటే గుర్తుకొచ్చే పేరు మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డిది.ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ టిక్కెట్ కోసం ముత్య౦ రెడ్డి కుమారుడు కూడా పోటీ పడుతున్నారు. కానీ మరణించిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ఏ టికెట్ ఇవ్వడం అనేది ఆనవాయితీ.
ఈ లెక్కన రామలింగారెడ్డి కుటుంబ సభ్యులకు టీఆర్ఎస్ టిక్కెట్ ఇస్తే ముత్యంరెడ్డి కుమారుడు రెబల్ అభ్యర్థిగా పోటీ చేసేట్టుఉన్నారు.అన్నిటికీ మించి అంతర్లీనంగా ప్రభుత్వంపై పై వ్యతిరేకత కూడా ఈ మధ్యపొడసూపిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సమీకరణాలను దృష్టిలో పెట్టుకునే హరీష్ రావు దుబ్బాకలో సతమతమవుతున్నారట.తానే పోటీలో ఉన్న అభ్యర్థి అన్నంతగా కష్టపడుతున్నారట.ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకున్న హరీశ్ రావే ఇంతగా హైరానా పడుతున్నారంటే దుబ్బాకలోటీఆర్ఎస్ పరిస్థితేమిటో అర్థం చేసుకోవచ్చునని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యాస్తున్నారు.మొత్తానికి దుబ్బాక ఈజీగా టీఆర్ఎస్ దున్నేసేటట్టు లేదు.