Revanth Reddy :కాంగ్రెస్ పార్టీలో కూడా మొదట చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేసినా వారు కూడా మౌనంగా ఉంటున్నారు. కానీ రేవంత్రెడ్డి Revanth Reddy వర్గం మాత్రం షర్మిలపై దాడికి దిగుతోంది.. రేవంత్రెడ్డి కూడా సందర్భం వచ్చిన ప్రతీసారి షర్మిల పార్టీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో రేవంత్రెడ్డి క్రియాశీల పాత్ర పోషిస్తున్నారన్నది నిజం! అయితే అనాదిగా కాంగ్రెస్పార్టీకి రెడ్డి సామాజికవర్గం అండగా నిలుస్తున్నది. నిజానికి ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రులైనవారిలో అత్యధికులు రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే! దామోదరం సంజీవయ్య, పీ.వీ.నరసింహారావు, రోశయ్య వంటివారిని మినహాయిస్తే సీఎం పదవి చేపట్టినవారంతా రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే! టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో రాజకీయంగా ప్రాధాన్యం తగ్గిందనే భావన రెడ్డి సామాజికవర్గానికి వచ్చింది..
కాంగ్రెస్లో ఫైర్బ్రాండ్ నేతలు కరువయ్యారనుకుంటున్న సమయంలో రేవంత్రెడ్డి వారికో ఆశాదీపంలా కనిపించారు. రేవంత్ కూడా ఈ సపోర్ట్ను బాగానే సద్వినియోగం చేసుకుంటున్నారు.షర్మిల తెలంగాణలో పాలిటిక్స్లో అడుగుపెడుతుండటంతో రేవంత్రెడ్డి వర్గంలో ఓ రకమైన ఆందోళన మొదలయ్యింది. రెడ్డి సామాజికవర్గంలో సింహభాగం షర్మిల వెంట వెళతారేమోనన్న అనుమానం మొదలయ్యింది. ఇప్పటికే రెడ్డి సంఘాల జేఏసీ షర్మిలకు మద్దతు ప్రకటించింది.. కొందరు ప్రముఖులు కూడా షర్మిలకు బాహాటంగానే మద్దతు పలికారు. ఇదంతా గమనించిన రేవంత్ రెడ్డి వర్గం అప్రమత్తమయ్యింది. తెలంగాణలో షర్మిలకు ఏం పని అంటూ దాడికి దిగడం మొదలు పెట్టింది. దీంతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.