Sarvepalli : నెల్లూరు జిల్లాలో టిడిపి అగ్రనేత ,మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజకీయ భవితవ్యంపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి.
వరుసగా నాలుగుసార్లు సర్వేపల్లి నియోజకవర్గంలో ఆయన ఓటమి పాలు కావడంతో రేపటి ఎన్నికల్లో ఆయన పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశమైంది.2014 ఎన్నికల్లో కూడా ఆయన ఓడిపోయినప్పటికీ చంద్రబాబు ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు.కీలకమైన వ్యవసాయ శాఖ ని కూడా అప్పగించారు.మంత్రి పదవి లో సోమిరెడ్డి రాణించినప్పటికీ సర్వేపల్లిలో మాత్రం చతికిలబడుతున్నారు.ఎందుకిలా అన్నదే విశ్లేషించాల్సిన విషయం. సర్వేపల్లి అంటే .. కృష్టపట్నం పోర్టు, పరిశ్రమలు, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు ఓ వైపు.. జలజలపారే కాలువలు, పచ్చని పొలాలు మరో వైపు… సుదూర ప్రాంతాల నుంచి పొట్టచేతపట్టుకొచ్చే బతుకుజీవులు ఇంకో వైపు…హెలికాప్టర్లలో ల్యాండ్ అయ్యే దేశ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు మరో వైపు… ఇలా ఆధునికత, సాంప్రదాయ జీవనశైలికి కలబోతగా విరాజిల్లుతున్న ప్రాంతమిది. ఇక్కడి నుంచి ప్రముఖ నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించారు. 1994, 99 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరసగా నాలుగు సార్లు ఓటమి చవిచూశారు
Sarvepalli : కనిపించని శత్రువులే కారణమా!
సోమిరెడ్డి నాలుగుసార్లు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి, మరోసారి కోవూరు ఉప ఎన్నికల్లో…వరస ఓటములు చవిచూశారు. గడిచిన నాలుగుసార్లు జరిగిన ఎన్నికలు పరిశీలిస్తే… 5 వేల నుంచి 14 వేల ఓట్ల తేడాతోనే సోమిరెడ్డిపై ప్రత్యర్థులు గెలుపు సాధిస్తూ వచ్చారు. ఆనం రామ నారాయణరెడ్డి , ఆదాల ప్రభాకర్ రెడ్డి, కాకాణి గోవర్దన్ రెడ్డి …వీరంతా బయటకి కనిపించే శత్రువులైతే, బయటపడని శత్రువులు లోలోపల సోమిరెడ్డి ఓట్లకి ఎవరి స్థాయిలో వారు గండి కొడుతుంటారని లోకల్గా టాక్ వినిపిస్తోంది. సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీకి బలమున్నప్పటికీ.. నాయకుల మధ్య ఆధిపత్య పోరు, శత్రుశేషాలే సోమిరెడ్డి ఓటమికి కారణమన్న వాదనలు ఉన్నాయి. సోమిరెడ్డికి రాజకీయ శత్రువుల సంఖ్య ఎక్కువనే చెబుతారు. ఆనం సోదరులతో సోమిరెడ్డికి అస్సలు గిట్టేదికాదంటారు. ఆ తర్వాత ప్రస్తుత నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డితో విభేదాలు తలెత్తి.. అవి కాస్తా బద్ధ శత్రుత్వానికి దారితీశాయంటారు. ‘నీ నియోజకవర్గానికే వస్తా…నువ్వు ఎలా గెలుస్తావో చూస్తా’నంటూ ఆదాల.. సోమిరెడ్డికి సవాల్ చేయడం అప్పట్లో సంచలనం రేపింది.
2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీచేసి ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. అనంతర పరిణామాల్లో సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డితో సోమిరెడ్డికి శత్రుత్వం ఏర్పడింది. 2014, 19 ఎన్నికల్లో కాకాణి చేతిలో సోమిరెడ్డి ఓటమిపాలయ్యారు. పైగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఒంటెద్దు పోకడలు పోయాడని అదే ఆయనకు పెద్ద మైనస్ అయిందంటున్నారు . ప్రతిసారీ సర్వేపల్లి ఎన్నికల సమరం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది. గెలుపు ఓటములపై పెద్ద ఎత్తున చర్చలే కాదు..కోట్లలో పందేలు సాగుతాయంటే ఇక్కడి రాజకీయం ఎలా ఉంటుందో అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో సోమిరెడ్డి సర్వేపల్లిని వదిలేసి…నెల్లూరు రూరల్ లేదా కోవూరు నుంచి పోటీచేయాలని భావిస్తున్నారట.అయితే ఆ రెండు చోట్ల కూడా వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా బలమైన వారే.అక్కడ సోమిరెడ్డి ఎంతవరకు నెగ్గుకురాగలడన్నదీ అనుమానాస్పదమే.ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో అసలు సోమిరెడ్డికి అసెంబ్లీకి పోటీచేసే అవకాశం వస్తుందా రాదా అన్నదే నెల్లూరు రాజకీయ వర్గాల్లో నలుగుతున్న అంశం.