Tirath Singh Rawat : ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ మరోసారి నోరు పారేసుకున్నారు. వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ..వార్తల్లోకి ఎక్కుతున్నారు. మొన్నటికి మొన్న..మహిళల వస్త్రధారణపై నోరుజారి కామెంట్స్ చేసి..వెనక్కి తగ్గిన తీరత్ సింగ్…పిల్లలను కనే విషయంలో వివాదాస్పద కామెంట్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అందచేస్తున్న రేషన్ ఎక్కువగా పోందాలని అనుకుంటే…ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ ఉచిత సలహా ఇచ్చారాయన.
Tirath Singh Rawat : ఆయనేం అన్నారంటే!
ఒక్కో వ్యక్తికి నెలకు ఐదు కిలోల బియ్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.ఓ కుటుంబంలో 10 మంది ఉంటే..50 కేజీలు అందుతాయని, అదే..20 మంది కుటుంబసభ్యులుంటే..100 కిలోలు బియ్యం వస్తాయన్నారు. ఇద్దరు కుటుంబసభ్యులున్న వారు దీనిని ఓర్చుకోలేకపోతున్నారని..20 మందిని ఎందుకు కనలేదంటూ ప్రశ్నించడం వివాదాస్పదమైంది. ఒక బాధ్యతయుతమైన స్థానం.అదీ ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతున్నాయి. అంతేగాకుండా మరో సందర్భంలో అమెరికా మన దేశాన్ని 200 ఏళ్ల పాటు పాలించిందంటూ ఆయన నాలిక కరుచుకున్నారు.
ఇంకో ఎపిసోడ్ ఏంటంటే!
సీఎంగా బాధ్యతలు చేపట్టి కొద్ది రోజుల కాకముందే..మహిళల వస్త్ర ధారణపై ముఖ్యమంత్రి కామెంట్స్ చేయడంపై మహిళా లోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలు చిరిగిన జీన్స్ ధరిస్తున్నారని..సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారంటూ ఆయన నోరు పారేసుకోవడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన వెనక్కి తగ్గారు. ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఎన్జీవోను నడిపిస్తున్న యువతి చిరిగిన జీన్స్ వేసుకోవడం చూసి ఆశ్చర్యం వేసిందని, ఈ వేషధారణతో ప్రజలను కలవడానికి వెళితే..సమాజానికి ఏం సంకేతాలు ఇస్తున్నట్లు అంటూ ఆయన ప్రశ్నించడం పట్ల మహిళలు ఘాటుగా రిప్లై ఇచ్చారు . సోషల్ మీడియాలో ఆయన్ను ప్రశ్నిస్తూ..కౌంటర్ కామెంట్స్ వదిలారు.తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, ఎంపీ ప్రియాంకా చతుర్వేది, కాంగ్రెస్ నేతలు, సినీ ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనువరాలు నవ్య నవేలి నందా కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. టోన్డ్ జీన్స్ ధరించిన ఓ ఫొటోని ఇన్స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన నవ్య అలాంటి దుస్తులు వేసుకోవడాన్ని తాను గర్వంగానే ఫీల్ అవుతానని తెలిపారు. తమ వస్త్రధారణ కంటే..ముందు మీ అభిప్రాయాలు, ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని ముఖ్యమంత్రికి సలహా ఇచ్చారు. అయితే..తర్వాత..ఆ పోస్టును డిలీట్ చేశారు. అప్పటికే ఆమె చేసిన పోస్టు నెట్టింట వైరల్ గా మారిపోయింది. ఆ వివాదం సద్దుమణిగిందో లేదో మళ్లీ పిల్లలను కనడం పై తాజాగా చేసిన కామెంట్స్ పై ముఖ్యమంత్రి ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి మరి.