దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కలకలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో ఈ మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. ఇందులో తెలంగాణ రాష్ట్రం ఒకటి.
స్వతహాగా డాక్టర్ అయిన తెలంగాణ గవర్నర్ తమిళిసై తెలంగాణలోని పరిణామాలపై స్పందించారు. కరోనా కలకలం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తెలంగాణ సర్కారుకు మింగుడు పడని కామెంట్లు చేశారు. కరోనా నియంత్రణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కార్ క్రియాశీలకంగా వ్యవహరించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ తమిళిసై ఓ ఇంటర్వ్యూలో ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.
గవర్నర్ మేడం ఇప్పటికే…
కరోనా ఉధృతిని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేయలేక పోయిందని గవర్నర్ తమిళసై అన్నారు. కరోనా తీవ్రత, వ్యాప్తిపై ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సూచనలు చేస్తూ, ఐదారు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలేదని గవర్నర్ తమిళిసై ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే టెస్టులు చేస్తున్నామని…ప్రభుత్వం సమర్ధించుకుంటోందని తెలంగాణ గవర్నర్ అన్నారు. కట్టడి ప్రాంతాల విషయంలో కూడా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. కోవిడ్ చికిత్స తెలంగాణ ప్రభుత్వానికి భారంగా మారిందన్నారు. అన్ని వసతులు సమకూర్చామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రభుత్వాస్పత్రుల పై రోగులు ఆసక్తి చూపట్లేదని తెలంగాణ గవర్నర్ విశ్లేషించారు.
తెలంగాణ హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు….
కరోనా బాధితులు ప్రభుత్వాస్పత్రుల్లో సదుపాయాలు లేక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారని తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్తో సమావేశమైనప్పుడు ఈ విషయాలను గట్టిగానే చెప్పానని తమిళిసై ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. కరోనా నియంత్రణకు పెద్ద సంఖ్యలో టెస్టులు చేయడమే పరిష్కార మార్గమని, మొబైల్ టెస్టింగ్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తమిళిసై అన్నారు. కాగా ఇప్పటికే తెలంగాణ హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు కరోనా విషయంలో తమ అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గవర్నర్ ఈ మేరకు స్పందించారు.
మళ్లీ అదే విధంగా….
ఇదిలాఉండగా, తెలంగాణలో మంగళవారం నాడు కొత్తగా 1682 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 93,937 కు చేరింది. నిన్న మరో 8 మంది చనిపోవడంతో కరోనా మృతుల సంఖ్య 711కి చేరింది. నిన్న ఒక్కరోజే 2070 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 72,202 కు చేరింది. ఇంకా 21,024 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.14,110 మంది హోం ఐసోలేషన్ లో ఉంటున్నారు. ఇండియాలో కరోనా రికవరీ రేటు 72.51 ఉండగా.. తెలంగాణలో 76.86 గా ఉంది. ఈ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 235 ,రంగారెడ్డిలో 166, వరంగల్ అర్బన్ 107,మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 106 కేసులు నమోదయ్యాయి.