కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో వ్యక్తంచేసిన అభ్యంతరాలన్నీ అర్థంపర్థంలేనివే- ఒకే మాటతో ఇటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, అటు ఏపీలోని వైఎస్ఆర్సీపీ సర్కారుపై తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు చేసిన కామెంట్ ఇది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోతిరెడ్డిపాడు సామర్థ్య పెంపుతోపాటు కొత్తగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం ముమ్మాటికీ అక్రమమేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పునరుద్ఘాటించారు. నీటి కేటాయింపులు, అనుమతులు లేకున్నా, ట్రిబ్యునల్ అవార్డుకు భిన్నంగా గోదావరి, కృష్ణానదుల్లో ఏపీ అక్రమంగా వాడుకుంటోందని మండిపడ్డారు.
కేసీఆర్కు మండిపోయింది ఇక్కడే
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఫీలయ్యారు. కేంద్రానికి లేఖ రాశారు. అపెక్స్ కమిటీ సమావేశం తేదీ ఖరారైంది. అయితే ఈ సమావేశం కంటే ముందే, తెలంగాణ సీఎం కేసీఆర్ తన వైఖరిని వెల్లడించారు.తెలంగాణలో కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టలేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ప్రాజెక్టులనే తెలంగాణ అవసరాలను తీర్చేలా రీడిజైన్ చేశామని ఆయన చెప్పారు. ఇదే విషయాన్ని ఆధారాలతో సహా కౌన్సిల్ సమావేశంలో చెప్పాలని నిర్ణయించారు. ఆయా ప్రాజెక్టులు ఎప్పుడు మంజూరయ్యాయి? ఎన్ని నిధులు కేటాయించారు? తెలంగాణ వచ్చేనాటికి ఎంత ఖర్చుచేశారు? ఎంత భూమి సేకరించారు? ఎన్ని టీఎంసీలు కేటాయించారు? తదితర వివరాలను సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణం, నీటి వాడకానికి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డుకు అనుగుణంగానే తెలంగాణ వ్యవహరిస్తున్నదనే విషయాన్ని ఆధారసహితంగా వివరించాలని తెలిపారు.
ఎందుకు ఇలా జరుగుతోంది?
వాస్తవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి మధ్య మంచి సఖ్యత ఉందనే విషయం తెలిసిందే. అయితే, నీటి వాడకం విషయంలో వీరిద్దరి మధ్య పొరాపొచ్చాలు ప్రారంభం అయ్యాయి. ఇది ఇరు రాష్ట్రాల ప్రకటనల నేపథ్యంలో ముదురు పాకాన పడుతున్నాయి. ఇవి కేంద్రం వద్దకు కూడా చేరుతున్నాయి. ఈ విషయంలో కేంద్రం వైఖరిపై కూడా కేసీఆర్ గుర్రుగా ఉన్నారు?
అక్కడే అసలు సమస్యా?
వాస్తవానికి కేంద్రం కూడా ఏపీ సర్కారుకు వత్తాసు పలుకుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తాము రీడిజైన్లు చేసిన ప్రాజెక్టుల విషయంలో కూడా ఏపీ ఫిర్యాదులతో ఇబ్బందులు పెడుతున్నారని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ఇదే సమయంలో మరో అంశం తెరమీదకు వస్తోంది. ఏపీ- తెలంగాణ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మధ్య వివాదాలు ముదరాలి అని బీజేపీ నేతలు భావిస్తున్నారా? కావాలనే పొగ పెడుతున్నారా? అనే డౌట్ కొందరు వ్యక్తం చేస్తున్నారు.