West Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ కలియాగంజ్ బీజేపీ అభ్యర్థి సౌమిన్ రాయ్పై ఆయన భార్య శర్బరీ సింఘా రాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన భర్తకు ఓటేయొద్దని, అతని క్యారెక్టర్ మంచిది కాదని మీడియా సమక్షంలో కలియాగంజ్ ప్రజలను కోరారు శర్బరీ.
West Bengal: ఇదీ నా భర్త నీచ చరిత్ర!
యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి.. వారి నుంచి చాలా డబ్బు దోచుకున్నాడు సౌమిన్. సౌమిన్ కు వేరొక మహిళతో అక్రమసంబంధం ఉంది. నన్ను, నా కూతుర్ని మోసం చేసి వేరే కాపురం పెట్టాడు. దయచేసి అతనికి ఓటేయొద్దు. ప్రజాప్రతినిధి అయ్యే అర్హత అతనికి లేదు అని శర్బరీ సింఘా రాయ్ మీడియా సమక్షంలో తెలిపారు. సౌమిన్ అక్రమాస్తుల వివరాలను కూడా ఆమె బయటపెట్టారు. కలియాగంజ్ అభ్యర్థిగా సౌమిన్ను తొలగించాలని తాను.. రాష్ట్ర, కేంద్ర బీజేపీ నాయకులను కోరినట్లు శర్బరీ తెలిపారు. అయితే, తన వ్యాఖ్యలను ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు.ఏ పార్టీకీ తాను మద్దతుగా మాట్లాడటం లేదని..సౌమిన్కు వ్యతిరేకంగా ప్రచారం మాత్రం నిర్వహిస్తానని శర్బరీ స్పష్టం చేశారు.
పార్టీ కేడర్లో కూడా వ్యతిరేకత!
కలియాగంజ్ భాజపా అభ్యర్థిగా సౌమిన్ రాయ్ పేరును ప్రకటించినప్పటి నుంచి నియోజకవర్గంలో చాలా వ్యతిరేకత ఏర్పడింది. సౌమిన్ రాయ్ను తొలగించాలని స్థానిక భాజపా నాయకులు, కార్యకర్తలు నిరాహార దీక్ష సైతం చేపట్టారు.
ప్రధానిపై చిదంబరం చిర్రుబుర్రు!
కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘బెంగాల్ను జయించాలని అత్యవసర యుద్ధమే ప్రకటించారు. అంతటి యుద్ధంలోనూ కరోనా మహమ్మారిపై సమీక్ష చేయడానికి రవ్వంత సమయం కేటాయించారు. అందుకు మీకు ధన్యవాదాలు’’ అంటూ చిదంబరం ఎద్దేవా చేశారు. బెంగాల్ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ సీఎం దీదీని ఉద్దేశిస్తూ దీదీ… ఓ దీదీ.. అంటూ సంబోధించారని, ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా సంబోధించడం సమంజసమేనా? అని చిదంబరం ప్రశ్నించారు. మాజీ ప్రధానులు నెహ్రూ, మొరార్జీ, వాజ్పాయ్ కూడా ఇలాంటి సంబోధన చేయలేదని చిదంబరం పేర్కొన్నారు. ‘వ్యాక్సిన్లు లేవు’ అని ఆస్పత్రుల్లో బోర్డులు వెలుస్తున్నాయని, అయినా సరే దేశంలో వ్యాక్సిన్ కొరత లేదని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రకటించడం విడ్డూరంగా ఉందని చిదంబరం మండిపడ్డారు.