RRR Arrest: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు వ్యవహారం ఢిల్లీ దాకా చేరింది.కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోర్టులో ఈ బాల్ పడింది. బుధవారం రాఘురామకృష్ణంరాజు కుమారుడు భరత్, కుమార్తె ఇందు ప్రియదర్శిని కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలిశారు.
ఏ విధంగా రఘురామ కృష్ణంరాజును అరెస్టు చేసిందీ వారు ఆయనకు వివరించారు. పోలీసు కస్టడీలో కూడా తమ తండ్రిని హింసించారని వారు ఆయనకు ఫిర్యాదు చేశారు. ఎంపీ అనికూడా చూడకుండా రఘురామ కృష్ణంరాజు పట్ల ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు చాలా నీచంగా వ్యవహరించారన్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పగబట్టి తన తండ్రి ని ఇబ్బందులపాలు చేస్తున్నారని వారు చెప్పారు.ఇవన్నీ అక్రమ కేసులని వారు వాపోయారు. ఒక ఎంపీ పై రాజద్రోహంకేసు పెట్టడం దారుణమన్నారు.ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తన తండ్రిని రక్షించాలని కోరుతూ వారిద్దరూ అమిత్షాకు వినతి పత్రం సమర్పించారు.
RRR Arrest: ఇప్పుడేమి జరగబోతోంది!
రఘురామకృష్ణంరాజు రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆయన దాదాపు అన్ని రాజకీయ పార్టీల్లో అడుగుపెట్టి బయటకొచ్చిన వారే.టీడీపీ బీజేపీలతో కూడా ఆయన సహజీవనం చేసిన వారే.మొన్నటి ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ దక్కడంతో ఆయన నర్సాపురం నుండి గెలిచారు.కానీ ఎందుకనో ఆ కొద్ది రోజులకే వైసిపి అధినేత జగన్ తో ఆయనకు బెడిసి౦ది.అధికార పార్టీలో ఉంటూనే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన కామెంట్లు చేయటం మొదలెట్టారు.ఇది పరాకాష్ఠకు చేరడంతో ఆయన వైసీపీకి పూర్తిగా దూరమయ్యారు.తదుపరి పరిణామాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దగ్గరైన రఘురామకృష్ణంరాజు వై కేటగిరీ భద్రతను పొందగలిగారు.లోక్సభలో కూడా ప్రత్యేక సీటును సంపాదించుకున్నారు.ఇదంతా బీజేపీ పెద్దల సహాయసహకారాల ఫలితమే అన్నది నిర్వివాదాంశం.ఆయనకు బిజెపి అగ్ర నాయకత్వంతో అవినాభావ సంబంధాలున్నాయని అంటారు.ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా రఘురామకృష్ణరాజుకు త్వరగానే లభిస్తోందని పీఎంవో వర్గాలు చెబుతుంటాయి.అమిత్ షా కి కూడా ఆయన దగ్గరివారేనని టాక్!ఈ నేపధ్యంలో రఘురామకృష్ణంరాజు అరెస్టు వ్యవహారంలో అమిత్షాగానీ కేంద్రంగానే జోక్యం చేసుకుంటుందా లేదా అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన హాట్ టాపిక్ అయింది.