YSRCP : ఏపీ అధికార పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు ప్రస్తుతం సీరియస్ మూడ్లో ఉన్నారు. అధికారులు తమకు సరైన ప్రోటోకాల్ పాటించడం లేదని ఇటీవలి కాలంలో విమర్శలు చేస్తూ వస్తున్నారు.
సాధారణంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఇలాంటి ఆరోపణలు చేస్తే అది సహజం అనుకోవచ్చు.కానీ అధికార పార్టీ శాసనసభ్యులే ఈ తరహా విమర్శలు చేస్తుంటే తప్పనిసరిగా వాటిని సీరియస్ గా పరిగణించాల్సి ఉంటుంది.మొన్నటికి మొన్న నగరి ఎమ్మెల్యే రోజా ప్రోటోకాల్ విషయంలో బాగా హర్టయ్యారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో తనను భాగస్వామిని చేయడం లేదంటూ కన్నీరుమున్నీరయ్యారు.అధికార పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గాను క్యాబినెట్ హోదా కలిగిన ఎపిఐఐసి చైర్మన్గా కూడా ఉన్న రోజాకుఇలాంటి చేదు అనుభవం ఎదురు కావటం గమనార్హం. తిరుపతిలో ఇటీవల జరిగిన ప్రివిలేజస్ కమిటీ సమావేశంలో రోజా పాల్గొని తన ఇబ్బందులను ఏకరువు పెట్టి కన్నీటి పర్యంతమయ్యారు.కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆమెను బుజ్జగించారు.ఈ వివాదం ఇంకా మరుగున పడకముందే మరో మాజీ మంత్రి వైసిపి ఎమ్మెల్యే ఇదే తరహా ఆరోపణలు చేశారు.
YSRCP : ఆగ్రహించిన ఆనం!
తాజాగా నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం ఆనం రామనారాయణ రెడ్డి ప్రోటోకాల్ విషయంలో అధికారులపై ఫైర్ అయ్యారు.గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యేలను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. జిల్లాలో అధికారులు కనీస ప్రోటోకాల్ పాటించడం లేదని.. ఎమ్మెల్యేగా తమకు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అర్హత లేదా అని ప్రశ్నించారు. అధికారులు ఎవరైనా చెబితే విస్మరించారా..? లేదా వారు కావాలనే నిర్లక్ష్యం చేశారో నిగ్గు తేల్చాలన్నారు.
జిల్లా అధికారులను అడిగితే ఎన్నికల కోడ్ నిబంధనలు అని చెబుతున్నారని.. ఈసీ దృష్టికి తాను ఈ విషయాన్ని తీసుకెళ్తానని ఆనం చెప్పారు. అలాంటి నిబంధనలు లేవని ఈసీ చెప్పినప్పటికీ.. ఈ విధంగా చేయడాన్ని తాను తీవ్రంగా పరిగణిస్తున్నానని.. చట్టపరంగా పోరాటం చేస్తానని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.అసలే ఆనం రామనారాయణ రెడ్డి మొదటి నుండి కూడా అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.ఏకంగా నెల్లూరు జిల్లా మంత్రి అనిల్ కుమార్ పైనే ఆయన ధ్వజమెత్తిన సందర్భాలు ఉన్నాయి.అలాగే పార్టీ వ్యవహారాలపై కూడా ఆయన బహిరంగంగానే తన నిరసన గళం వినిపిస్తున్నారు.తాజాగా ఆనం రామనారాయణరెడ్డి ప్రొటోకాల్ వివాదాన్ని లేవనెత్తటం రాజకీయ ప్రాధాన్యతను కూడా సంతరించుకుంది. మరి ఈ విషయంపై వైసీపీ అధిష్ఠానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి!