టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్ట్ పై ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ నేతలు. వీరిలో చంద్రబాబు నాయుడు నుంచి మొదలు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వరకూ అంతా దీన్ని బీసీలపై దాడిగా అభివర్ణించే ప్రయత్నం చేశారు! అచ్చెన్నాయుడి కిడ్నాప్ బహీనవర్గాలపై దాడి.. రాష్ట్రవ్యాప్తంగా బడుగు బహీనవర్గాలు, మేధావులు, ప్రజలు నిరసన తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి! అని చంద్రబాబు స్పందిస్తే… బీసీనేతలకిచ్చే గౌరవం ఇదేనా? అంటూ రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు! వీరి ప్రశ్నల్లో, ఆవేదనలో నిజమెంత, ధర్మం ఎంత.. వీరి మాటలు బీసీలు వినాల్సిన అవసరం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం!
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు.. ఆలయాల్లో పనిచేస్తున్న తమకు కమీషన్ను పెంచాలని సచివాలయం దగ్గర నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును నాయీ బ్రాహ్మణులు కోరారు. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన చంద్రబాబు… తనతో పెట్టుకుంటే తోకలు కత్తెరిస్తానంటూ నాయీ బ్రాహ్మణులు మనోభావాలనే దెబ్బతీసేలా వ్యవహరించారు. ఇప్పుడు బీసీల మనోభావాల గురించి, బీసీలపై దాడు గురించి మాట్లాడుతున్న బాబుకు నాడు ఆ విషయం గుర్తు రాలేదా? అచ్చెన్నా ఒక్కడే బీసీనా… నాయీ బ్రాహ్మణులు బీసీలు కాదా? అనే ప్రశ్నలు బీసీ సామాజిక వర్గ ప్రజల నుంచి వస్తున్నాయి.
బీసీలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని మాట్లాడుతున్న రామ్మోహన్ నాయుడికి.. నాడు నాయీ బ్రాహ్మణుల విషయంలో బాబు ఇచ్చిన గౌరవం గుర్తురాలేదా? ఆ సంఘటన చూశాక బలమైన బీసీ నేతలుగా ఎదుగుతున్న మీకు అప్పుడు కనిపించలేదా? అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే.. అది కూడా అవినీతి కేసులో అరెస్టు చేస్తేనే.. బీసీలు, వారి గౌరవాలు, వారి వారి మనోభావాలు గుర్తుకు వస్తాయా? నాయకులకేనా మనోబావాలు ఉండేది.. ఆ సామాజిక వర్గంలో పుట్టిన సాధారణ ప్రజలకు ఉండవా? ఏమో… టీడీపీలోని బీసీ నేతలే చెప్పాలి! ఇవన్నీ మరిచిన చంద్రబాబు – రామ్మోహన్ నాయుడు… బీసీలంతా గర్జించాలని అనడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో బీసీ సామాజిక వర్గ ప్రజలే నిర్ణయించుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు!