ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ ప్రభావం ప్రధానంగా ప్రభుత్వ సర్వీసు పింఛనుదారులపై పడింది.ఉద్యోగస్థులకు ఏదో విధంగా జీతాలు ఇవ్వగలిగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
శుక్రవారం వరకు కూడా పింఛన్దారులకు పెన్షన్ చెల్లించలేదు.నిధులు లేకపోవటమే ఇందుకు కారణం.ఇంతకు ముందు వరకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలతో పాటు పింఛన్ దారులకు పెన్షన్లు కూడా ఒకటవ తారీఖునే చెల్లింపులు జరిగేవి.కానీ కరోనా వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారింది. రెండు నెలల పాటు ఉద్యోగస్తులకు,పింఛనుదారులకు సగం జీతమే చెల్లించారు. ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు చెల్లింపు దాదాపు జరగడం లేదు. గతంలో అయితే 12వ తేదీన పెన్షనర్లకు పింఛన్ చెల్లించారు. ఇక సెప్టెంబర్ విషయానికి వస్తే ఒకటో తేదీన మంగళవారం ఆర్బీఐలో బాండ్లను వేలం వేయడం ద్వారా రూ. మూడు వేల కోట్లను తీసుకొచ్చిన ప్రభుత్వం జీతాలు చెల్లించింది. కానీ పెన్షన్ల చెల్లింపు కోసం ఆ మెుత్తం సరిపోలేదు. ఉద్యోగుల జీతాల కోసం దాదాపుగా రూ. నాలుగు వేల కోట్లు,పెన్షన్ల కోసం రూ. పదిహేను వందల కోట్లు నెలకు అవసరం అవుతాయి.
ఉద్యోగుల జీతాలకు సరిపెట్టినా.. పెన్షన్ల కోసం.. పదిహేను వందల కోట్లు ఎక్కడి నుంచి తేవాలా అని ఆర్థిక శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద నిధులు లేవు. ఓవర్ డ్రాఫ్ట్కు వెళ్తే ఆర్బీఐ రూ. పదిహేను వందల కోట్లు ఇస్తుంది. కానీ సీఎం జగన్ మాత్రం.. ఓవర్ డ్రాఫ్ట్ లాంటి అతి స్వల్ప సమయం ఉండే అప్పులపై ఆసక్తిగా లేరు. దీంతో వేస్ అండ్ మీన్స్ కింద ఆర్బీఐ నుంచి సేకరించాలని ఆర్థిక శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ నిధులను సేకరించి శుక్రవారం తర్వాత పెన్షనర్లకు పెన్షన్లు అందించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ ఏదైనా ఇబ్బంది వస్తే.. మంగళవారం మళ్లీ బాండ్ల వేలం వేసి… నిధులు సమీకరించి ఇచ్చే అవకాశం ఉంది.
ఏదేమైనా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షనర్లకు ప్రతీ నెలా టెన్షన్ తప్పడం లేదు. ఆలస్యంగా రావడమే కాదు..లాక్ డౌన్ పేరుతో రెండు నెలలు కోత విధించారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఇస్తున్నా.. సమయానికి రావడం లేదు. రిటైరైన వారికి పెన్షనే ఆధారంగా ఉంటుంది. అనేక సమస్యలు ఉంటాయి. తమ జీవితాంతం సర్వీస్ చేసిన వారికి ప్రభుత్వం ఇలా ఆలస్యం చేయడం కరెక్ట్ కాదన్న వాదన వినిపిస్తోంది. సామాజిక పింఛన్లను ఒకటో తారీఖున ఇంటికి వెళ్లి మరీ చెల్లిస్తున్న ప్రభుత్వం సర్వీసు పెన్షనర్ల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి ఇది జగన్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తోంది!