ఎప్పుడూ లేనంతగా, ఏ ఎన్నికల కమిషనర్ పొందనతగా వివాదాలలో చిక్కుకున్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్. గతకొంత కాలంగా వివాదాలకు ఆయన కేఫార్ అడ్రస్ గా నిలిచారన్నా అతిశయోక్తి కాదేమో! ప్రభుత్వంపై లేఖలు రాయడం.. అది తాను రాసిందో, టీడీపీ ఆఫీసులో పుట్టిందో చెప్పడానికి కూడా సుమారు పక్షం రోజులు జనాలను సస్పెన్స్ లో పెట్టిన వైనం.. హైకోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో చేసిన హడావిడీ.. పెట్టిన ప్రెస్ మీట్ లు.. హుటాహుటిన తీసేసిన ఉద్యోగాలు.. ఇవన్నీ కలిసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంపై కొన్ని అనుమానాలను తెరపైకి తెచ్చాయనడంలో సందేహం లేదు!
మొదటినుంచీ వైకాపా నేతలు చెబుతున్నట్లుగానే జరుగుతుందనే వాదనలు కూడా హైకోర్టు తీర్పు అనంతరం ఆయన హడావిడితోనే మొదలైపోయాయి. అనంతరం వ్యవహారం సుప్రీం వరకూ వెళ్లడంతో అంతా మౌనంగా ఉన్నారు. ఈ క్రమంలో పార్క్ హయత్ హోటల్ లో మాజీ టీడీపీ నేతలతోనూ, చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన బీజేపీ నేతలతోనూ.. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి అయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ అవ్వడంతో వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. ఈ మీటింగ్ జరిగి 10రోజులు అయిన అనంతరం ఒక ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది.. ఏపీ రాజకీయాలను ఒక కుదుపు కుదిపింది. దీంతో… నిమంగడ్డ వ్యవహారంపై వైకాపా నేతలు చేస్తున్న విమర్శలకు, ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మద్దతు పెరిగినట్లయ్యింది!
ఈ వ్యవహారం వెలుగులోకి రావడం.. టీడీపీ నేతలు మౌనాన్నే తమ బాషగా చేసుకుని ఉండటం.. బీజేపీ అధిష్టాణం సీరియస్ అవ్వడంతో… మీడియా ముందుకు వచ్చారు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస రావు! కలిశాం.. తప్పేంటి.. ఆయన నాకు ఎప్పటినుంచో పరిచయం, పైగా చుట్టం, ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు.. అని సుజనా చౌదరి స్పందించారు. కలిశాం కానీ… విడివిడిగా కలిశాం.. అసలు నిమ్మగడ్డ- నేను – సుజనా ఒకే రూం లో ఉన్నాం కానీ… వారిద్దరూ మాట్లాడుకున్నవి నేను వినలేదు, నేను వేరే విషయాలు సుజనా చౌదరితో మాట్లాడేసి వచ్చాను అని కామినేని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఆ సంగతులు అలా ఉంటే… ఈ విషయంపై బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం స్పందించలేదు. తనపై ఎంత పెద్ద ఆరోపణలు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా, వాటిలో వాస్తవ శాతం ఉందని నిరూపణ అవుతున్నా… కనీసం అది తప్పనో, రైటనో కూడా స్పందించడానికి చాలా సమయమే తీసుకునే నిమ్మగడ్డ.. ఈ విషయంపై ఇంకా స్పందించలేదు!
అయితే.. వస్తున్న విమర్శలు, జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో.. ఈ రోజు నిమ్మగడ్డ మీడియా ముందుకు వచ్చే సూచనలు ఉన్నాయని కొందరు అంటుంటే… ఆయన ఇప్పుడున్న పరిస్థితితుల్లో అంత ధైర్యం చేయలేరని మరికొందరు అంటున్నారు! ఏది ఏమైనా.. ఈ విషయంలో నిమ్మగడ్డ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇవ్వని పక్షంలో.. వైకాపా నేతల విమర్శలకు, ఏపీ ప్రభుత్వ వాదనలకు మరింత బలం చేకూరుతుందనడంలో సందేహం అక్కరలేదనే వాదనలు పెరుగుతున్నాయి!