తిరుపతి ఉప ఎన్నిక వ్యవహారం రాజకీయంగా కాకపుట్టిస్తోంది. ఇప్పటివరకూ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగితే…ప్రస్తుతం మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ…తమ అభ్యర్థుల విషయంలో ఇప్పటికే ఓ అవగాహనకు రాగా..మూడో పక్షంగా ఉన్న జనసేన- బీజేపీ విషయంలో సందిగ్ధత నెలకొంది.తిరుపతిలో పోటీ విషయమై బీజేపీ, జనసేన భిన్నవాదనలు దేనికి సంకేతం..? ఆ రెండు పార్టీల మధ్య పొత్తు పొడుస్తోందా..? అనే అనుమానం!తిరుపతి లోక్సభ ఉపఎన్నికపై రెండు పార్టీలు రోజుకో మాట చెబుతున్నాయి. కొద్ది రోజుల క్రితం…తిరుపతి సభలో పాల్గొన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థిని గెలిపించాలంటూ పార్టీ నేతలకు పిలుపు నిచ్చారాయన.
ఇందుకోసం కార్యకర్తలందరూ కృషి చేయాలని సోము వీర్రాజు అన్నారు.తిరుపతి ఎన్నికల విషయంలో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలకు జనసేన నాయకుడు కిరణ్ కౌంటర్ ఇచ్చారు. తిరుపతి అభ్యర్ధి ఎవరో సోము వీర్రాజుకే తెలియదన్నారాయన. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి కామెంట్స్ గందరగోళానికి గురిచేస్తున్నాయని అన్నారు. జనసేన పార్టీ బీజేపీ కన్నా బలంగా ఉందని..ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.బీజేపీ-జనసేన కూటమి నుంచి ఎవరు పోటీ చేయాలన్న అంశంపై ఇంకా స్పష్టత రాకముందే సోము వీర్రాజు ప్రకటన చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. మరోవైపు తిరుపతిలో పోటీ చేస్తామని ఇప్పటికే జనసేన నేతలు పలుమార్లు ప్రకటించారు.
దీంతో బీజేపీ, జనసేన కూటమిలో తిరుపతి నుంచి ఎవరు బరిలో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. అయితే యథాప్రకారం జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రం మౌనముద్ర లోనే ఉన్నారు.ఆయన మనసులో ఏముందో జనసైనికులకు తెలియడం లేదు.జనసేన వరకూ చూస్తే తిరుపతి వారికి మంచి నియోజకవర్గమే.గతంలో పవన్ కల్యాణ్ అన్న మెగాస్టార్ చిరంజీవి పాలకొల్లు లో ఓడిపోయినప్పటికీ తిరుపతిలో గెలిచారు. పవర్ స్టార్ కి కూడా అక్కడ గట్టి ఫాలోయింగ్ ఉంది పవన్ కల్యాణ్ తిరుపతి విషయంలో పట్టుబడితే పని జరుగుతుందని జనసైనికులు చెబుతున్నారు.మరి పవన్ కల్యాణ్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మాదిరి ఆఖరి నిమిషంలో బీజేపీకి తిరుపతి సీటును త్యాగం చేస్తారా లేక జనసేన అభ్యర్థిని పోటీ చేయిస్తారా అనేది చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?