ఏపీ రాజధాని అంశం ఇప్పుడు హైకోర్టు పరిధిలో ఉంది. కోర్టు స్టేటస్ కో ఇవ్వడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయింది. సుప్రీం నుంచి మూడు రాజధానుల విషయంలో సానుకూల సంకేతాలే వస్తాయని సీఎం జగన్ తోపాటు ప్రభుత్వ వర్గాలు కూడా భావిస్తున్నాయి. అందుకు తగిన అస్త్రాలను పూర్తిగా సిద్దం చేసుకుని పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. కోర్టు నుంచి అనుకూలమైన తీర్పు వస్తే శరవేగంగా విశాఖలో రాజధాని పనులు చేపట్టాలని సీఎం జగన్ భావిస్తున్నారు. దీనిలో ప్రధాని మోదీని కూడా భాగస్వామ్యులను చేయాలని కూడా సీఎం భావిస్తున్నారు. తనకు మోదీ అండ, కేంద్రం మద్దతు ఉన్నట్టు ప్రజలకు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు.
మోదీ వస్తారా.. రారా..?
ప్రొటోకాల్ ప్రకారం సీఎం జగన్ కేంద్రంలోని పెద్దలని పిలుస్తారు. అయితే.. ప్రధాని మోదీ వస్తారా లేదా అనేదే ప్రశ్న. 2015లో అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోదీ యమునా మట్టి, నీళ్లు తీసుకొచ్చారు. ఆ తర్వాత అమరావతిపై మోదీ పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో మోదీపై చంద్రబాబు అనేక విమర్శలు చేశారు. దీనిపై మోదీ నొచ్చుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో కేంద్రం నుంచి అమరావతికి పెద్దగా సాయం అందలేదు. ఇందుకు బీజేపీపై కూడా విమర్శలు వచ్చాయి. రాజధాని తరలింపు అంశంలో వైసీపీ-బీజేపీ కలిసే నాటకాలు ఆడుతున్నాయని టీడీపీ మొదటి నుంచీ విమర్శిస్తోంది. టీడీపీని దెబ్బ తీసే కుట్రలో ఇదొక భాగమని నమ్ముతోంది.
జగన్ వెనుక మోదీ ఉన్నట్టా.. లేనట్టా..?
మోదీ కనుక విశాఖకు వస్తే.. అమరావతి శంకుస్థాపనకు ఇప్పుడు విశాఖకు ఎలా వస్తారంటూ టీడీపీ విమర్శించే అవకాశం ఉంది. విశాఖకు రాజధాని రావడం కన్ఫర్మ్ అయితే.. ఆ శంకుస్థాపనకు రాకూడదనే కొందరు బీజేపీ పెద్దల ఆలోచనగా ఉందని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో మోదీ వచ్చినా రాకపోయినా ఓ లేఖ రాస్తారని.. అవసరమైన నిధులు సమకూరుస్తారని అంటున్నారు. ఇదే జరిగితే జగన్ వెనుక ప్రధాని మోదీ ఉన్నట్టే. వీటిపై త్వరలోనే స్పష్టత వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.