ఇంట్లో వాళ్లకు చెప్పలేనివాడు ఇండియాకు సలహా ఇచ్చినట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ వైఖరి ఉందని సెటైర్లు పడుతున్నాయి. మూడు రాజధానుల బిల్లుకి గవర్నర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో అమరావతి నుంచి రాజధాని తరలింపు పై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా కృష్ణా-గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ టిడిపి ప్రజాప్రతినిధులు ఇతర నాయకులు రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఇదే సమయంలో జనసేనకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదుని పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు అన్నది పెద్ద ప్రశ్న. మొన్నటి ఎన్నికల్లో రాపాక ఒక్కడే జనసేన నుండి తూర్పు గోదావరి జిల్లా లో గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రారంభంలో జనసేన అధినేత కు అనుగుణంగానే విధేయంగా నడుచు కొన్న రాపాక తర్వాతి కాలంలో కాలరు ఎగరేశారు. ఇంకా చెప్పాలంటే జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోయారు. అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భాల్లో కూడా వైసీపీ ఎమ్మెల్యే లకు మించి జగన్ ప్రభుత్వానికి రాపాక మద్దతు గా మాట్లాడారు. తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేనన్న విషయాన్ని రాపాక ఎప్పుడో మర్చిపోయారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు చాలా దూరం జరిగిపోయారు.
ఇందుకో ప్రధాన కారణం కూడా ఉంది అంటారు. ఒక పేకాట రాయుడు కేసులో రాపాక జోక్యం చేసుకున్నప్పుడు రాపాక పై కేసు కూడా నమోదైంది తమ విధి నిర్వహణకు ఆటంకం కలిగించారని ఎస్సై ఫిర్యాదు మేరకు ఇది జరిగింది. ఆ తరుణంలో పవన్ కళ్యాణ్ పెద్దగా తనకు మద్దతు ఇవ్వలేదన అసంతృప్తి రాపాకకి ఉందంటారు. అదే సమయంలో జగన్ ప్రభుత్వం ఈ కేసులో రాపాకకి కొద్దిగా అనుకూలంగా వ్యవహరించిందని కూడా సమాచారం.
మొత్తం మీద రాపాక ముఖ్యమంత్రి జగన్ అభిమాని గా మారిపోయారు. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పిలుపిచ్చినా రాపాక తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు.ఈ నేపథ్యంలోనే తన సొంత పార్టీ ఎమ్మెల్యేను కట్టడి చేయలేని పవన్కళ్యాణ్ ఇతరులకు ఎందుకు ఉచిత సలహాలు ఇస్తారు అన్న పంచ్ డైలాగులు పడుతున్నాయి. ముందు సొంత ఇంటిని చక్కదిద్దుకొని తర్వాత పరాయి ఇంటిలో పవన్ కళ్యాణ్ వేలు పెడితే బాగుంటుందని కౌంటర్ విమర్శలు వస్తున్నాయి