Srikanth addala : బ్రహ్మోత్సవం సినిమా తర్వాత మళ్ళీ ఏ సినిమాతోనూ కనిపించలేదు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా మిగిలింది. దాంతో ఆయనకి వెంటనే అవకాశాలు రాలేదు. ఎట్టకేలకి ఒక రీమేక్ సినిమాకి డైరెక్షన్ చేసే అవకాశం అందుకున్నాడు, అదే వెంకటేశ్ – ప్రియమణి జంటగా నటించిన నారప్ప. తమిళంలో 100 కోట్లకి పైగా వసూళ్ళు రాబట్టిన సెన్షేషనల్ హిట్ని తెలుగులో ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను నిర్మించారు. అయితే ఈ సినిమాకి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అనగానే చాలామంది హిట్ ఇస్తాడా అని సందేహాలు వ్యక్తం చేశారు.
ఆ సందేహాలు నిజమయ్యాయని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. తమిళంలో ధనుష్ పోషించిన పాత్రను ..సినిమాలోని సన్నివేశాలను ఏమంత మార్చకుండా దింపేసినట్టు చెప్పుకుంటున్నారు. తమిళంలో రూపొందిన అసురన్ మూవీకి వెట్రిమారన్ దర్శకత్వం వహించాడు. ఆయనని ఫాలో అయి అచ్చుగుద్దినట్టు జిరాక్స్ కాపీలా నారప్ప సినిమా ఉందని ..ఒరిజినల్ డైరెక్టర్ అయితే కనీసం కొన్ని మార్పులైనా చేసి ఉండేవాడేమోనని మాట్లాడుకుంటున్నారట. సినిమా రిలీజై కొన్ని గంటలైనా కాకముందే డివైడ్ టాక్ వస్తోంది. ఈ మూవీని శ్రీకాంత్ అడ్డాల సరిగ్గా డీల్ చేయలేకపోయాడని..ఒకరకంగా మైనస్ అయ్యాడని చెప్పుకుంటున్నారు.
Srikanth addala : దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు నారప్ప మైనస్..?
నారప్ప మీద చాలా నమ్మకాలు పెట్టుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు నారప్ప మైనస్గానే మారిందని కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట. చూడాలి మరి ఈ వారంతరానికి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో. కాగా ప్రస్తుతం ఆయన ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్లో అన్నాయ్ అనే సినిమాను తెరకెక్కించనున్నాడు. గుంటూరు బ్యాక్ డ్రాప్లో ఈ సినిమాను రూపొందిస్తుండగా మూడు భాగాలుగా రిలీజ్ చేయనున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ సాగుతుందట. త్వరలో నటీ నటులను ప్రకటించి సెట్స్ మీదకి రాబోతున్నట్టు వెల్లడించారు.