ఏపీ పోలీసుల మైండ్ సెట్ ఏమీ మారినట్టు లేదు . వారి కారణంగా రోజుకో వివాదం చోటు చేసుకుంటూనే ఉంది.మాస్కు ధరించలేదని చీరాలలో దళిత యువకుడు కిరణ్ కుమార్ ని ఒక ఎస్సై కొట్టడంతో అతను మరణించిన విషయం తెలిసిందే.
అలాగే తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న వర ప్రసాద్ అనే యువకుడికి పోలీసులు శిరోమండనం చేయటం విధితమే.ఇలాంటి సంఘటనలే ఇంకా శ్రీకాకుళం ,చిత్తూరు జిల్లాల్లో కూడా జరిగాయి. ఇలా పోలీసుల దాష్టీకానికి గురవుతున్నవారు దళితులే కావటం ఇంకో ముఖ్యాంశం. పోలీసుల వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ ప్రభుత్వానికి పోలీసులు తలనొప్పిగా మారారు.ఉన్న సమస్యలతోనే ఏపి డిజిపికి తల బొప్పి కట్టగా తాజాగా విజయవాడలో పోలీసుల అదుపులో ఉన్న యువకుడు మరణించడం ఆయనను మరింత ఇరకాటంలోకి నెట్టేసింది.మద్యం అక్రమ రవాణా కేసులో పోలీసులు ఓ దళిత యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించే క్రమంలో అతను తీవ్ర అస్వస్థత గురై మరణించడం సంచలనంగా మారింది.పోలీసులు చిత్రహింసలు పెట్టడం వల్లే అతను మృతి చెందాడంటూ దళిత సంఘాలు ధర్నాకు దిగడంతో బెజవాడ దద్దరిల్లింది.
వివరాల్లోకి వెళితే బెజవాడలోని కృష్ణలంక పెద్దవారి వీధిలో డి.అజయ్(26) తన తల్లి నాగేశ్వరమ్మతో కలిసి నివసిస్తున్నాడు. అజయ్ కారు డ్రైవర్ కాగా.. అతని తల్లి సమీపంలోని చర్చిలో వాచ్ మెన్.ఏపీలో మద్యం అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ ప్రత్యేక నిఘా ఉంచింది. నెలరోజుల క్రితం హైదరాబాద్ నుంచి విజయవాడకు అక్రమంగామద్యం సరఫరా అవుతున్నట్లు గుర్తించారు.చేపల చెరువులో ఆహారం ఉపయోగించే ఫిడ్ లో మద్యం బాటిళ్లు పార్సిల్స్ అవుతున్నట్లు పోలీసులు కనిపెట్టారు.ఈ పార్సిల్ అజయ్ పేరుమీద వస్తుండడంతో అతడిపై పోలీసులు నిఘాపెట్టారు.విషయం తెలిసి పరారీలో ఉన్న అజయ్ ని ఎట్టికేలకు గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అతడిని విచారిస్తున్న సమయం లో అతడు కుప్పకూలడంతో వెంటనే విజయవాడ ప్రభుత్వాస్పత్రి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ అజయ్ మరణించాడు.ఈ విషయం తెలియడంతో దళిత సంఘాలు సంఘాలు ఆస్పత్రి ఎదుట ధర్నాకు కూర్చున్నాయి. దీంతో బెజవాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే ఎస్ఈబీ అదనపు ఎస్పీ మేకా సత్తిబాబు రంగంలోకి దిగి ఆందోళనకారులతో చర్చించారు.అజయ్ అనారోగ్యం వల్లే మరణించాడని పోలీసులు కొట్టలేదని అని అయన చెప్పారు.పోస్టుమార్టం నివేదిక వచ్చాక ఒకవేళ అందులో పోలీసులు కొట్టినందున అతడు మరణించాడని రుజువైతే తదుపరి చర్యలు తీసుకుంటామని సూరిబాబు హామీ ఇచ్చారు.ప్రస్తుతానికి వ్యవహారం సద్దుమణిగినప్పటికీ పోలీసుల మీద పడ్డ మరకలు మాత్రం చెరిగిపోవడం లేదు!