‘టిక్ టాక్..’ భారతీయుల జీవనంలో భాగమైపోయిందనడంలో ఎటువంటి సందేహం లేదు. తమలోని టాలెంట్ ను ప్రదర్శించేందుకు టిక్ టాక్ దోహదపడింది. ఇంతలా భారతీయుల్లో మమేకమైపోయిన టిక్ టాక్ ప్రస్తుతం ఇండియాలో నిషేధానికి గురైంది. దీంతో టిక్ టాక్ వీడియోలు చేసేవారు మాత్రమే కాకుండా.. వీడియోలకు అలవాటు పడిపోయిన వారు కూడా స్తబ్దుగా ఉండిపోయారు.
భారత్ పై చైనా దుశ్చర్యలకు గుణపాఠం చెప్తూ భారత ప్రభుత్వం మొత్తం 59 చైనా యాప్స్ ను నిషేధించిన సంగతి తెలిసిందే. ఇందులో బాగా ఎఫెక్ట్ అయిన యాప్ టిక్ టాక్. అయితే.. ప్రభుత్వం ఇటివల చర్చలకు పిలిచిందని.. యాప్ ను తిరిగి రన్ చేస్తామని ఆశలు కల్పించారు టిక్ టాక్ యాజమాన్యం. కానీ.. వీరందరి ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లేట్టే ఉంది. టిక్ టాక్ చైనాకు చెందిన కమ్యూనిస్టు పార్టీలు నడిపిస్తున్నాయని అనుమానిస్తోంది ఇండియా. ఇంకా చైనాకు సంబంధించి మరింత కఠిన నిర్ణయాలు తీసుకునే యోచనలో ఉందని తెలుస్తోంది. అయితే.. టిక్ టాక్ యాజమాన్యం మాత్రం భారత ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తోంది.
ఇంతవరకూ చైనా ఎప్పుడూ డేటా అడగలేదని.. అడిగినా ఇవ్వమని చెప్తోంది. ప్రస్తుతం టిక్ టాక్ డాటా అంతా సింగపూర్ లోని సర్వర్లలో ఉంచినట్టు చెప్తోంది. ఇకపై డాటాను ఇండియాలోనే భద్రపరుస్తామని కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తోంది. టిక్ టాక్ కు ఇండియాలో రెండు వేల మంది ఉద్యోగులున్నట్టు కూడా చెప్తోంది. అయితే భారత్ మాత్రం చైనాకు బుద్ది చెప్పాలని గట్టి నిర్ణయంతో ఉంది. ఇప్పటికే ఇండియా తీసుకున్న చర్యలతో బ్యాన్ చేసిన చైనా యాప్ప్ కు ఇప్పటికే లక్షన్నర కోట్లు నష్టం వచ్చిందని తెలుస్తోంది.