రాజధాని తరలింపు విషయంలో ఆ రెండు పార్టీల దారులు వేరయ్యాయి.దీంతో బిజెపి- జనసేన పొత్తు కొనసాగుతుందా లేదా అన్నది డైలమాలో పడింది.
రాజధాని అమరావతి విషయంలో బీజేపీ, జనసేనల మధ్య తొలి నుంచి కొంత అయోమయ వాతావరణం నెలకొంది.అయితే తాజాగా జనసేన రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న స్టాండ్ తీసుకుంది.రాజధాని తరలింపు అంశానికి సంబంధించి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని జనసేన పార్టీ నిర్ణయించింది. భూములు ఇచ్చిన రైతులకు ఎట్టిపరిస్థితుల్లో అన్యాయం జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని జనసేన పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది.
అమరావతిలో ఇప్పటికే నిర్మాణాలు చేపట్టారని, కొన్ని నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నందున రాజధానిని తరలిస్తే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని జనసేన అభిప్రాయపడింది. హైకోర్టులో కౌంటర్ వేయాలని జనసేన నిర్ణయించింది.ఇక బిజెపి విషయానికొస్తే కన్నాలక్ష్మీనారాయణ పార్టీ చీఫ్ గా ఉన్నప్పుడు అమరావతి రాజధానిగా ఉండాలన్న వాదన వినిపిస్తూ వచ్చారు.అదే వైఖరితో ఉన్న జనసేన కూడా ఆ సమయంలోనే బిజెపి పంచన చేరింది .
పవన్ కన్నాలు కలిసి రాజధాని అమరావతి రైతుల కోసం లాంగ్ మార్చ్ చేస్తామని ఢిల్లీలో ఆర్భాటంగా ప్రకటించారు. కానీ పార్టీ కేంద్ర నాయకత్వం వత్తిడితో అది నిరవధికంగా వాయిదా పడింది.ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు వచ్చారు. అమరావతి రాజధాని తరలింపుపై తమ జోక్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు. రాజధాని రైతులకు న్యాయం జరగాలని మాత్రం పోరాడతామని చెప్పారు.
రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదని పదే పదే స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు కూడా రాజధాని అమరావతి తరలింపు ప్రక్రియను అడ్డుకునే అవకాశం లేదని స్పష్టమవుతుంది.ఇది నచ్చని జనసేన స్వంతంగానే రాజధాని అమరావతి విషయంలో పోరాటానికి సిద్ధపడింది .ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు అటక ఎక్కవచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?