ఈరోజుల్లో డబ్బుల కాడ సొంతవాళ్లనే నమ్మలేం. డబ్బు ఎవ్వరితోనైనా ఏదైనా చేయిస్తుంది. అందుకే డబ్బు విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కమీషన్లు ఆశ చూపి చాలామంది మోసాలు చేయాలని చూస్తారు. వాళ్ల ట్రాప్ లో పడొద్దు.. అని అందరూ చెబుతున్నా.. కొందరు మాత్రం అత్యాశతో మొత్తం పోగొట్టుకుంటారు. అటువంటి వార్తలు మనం రోజూ చూస్తూనే ఉన్నాం. అయినా మోసాలు మాత్రం ఆగడం లేదు.
తాజాగా ఓ మహిళ ఇలాగే కమీషన్ ఆశ చూపించి మహిళలను నట్టేట ముంచింది. ఈ ఘటన తెలంగాణలోని నల్గొండలో చోటు చేసుకున్నది. టప్పర్ వేర్ బిజినెస్ పేరుతో వ్యాపారం మొదలు పెట్టి.. లక్ష రూపాయలు కడితే 30 వేల కమీషన్ ఇస్తా అంటూ ఓ మహిళ నమ్మబలికింది. అక్కడ ఉన్న మహిళలను బుట్టలో వేసుకుంది. ఇంకేముంది.. కొందరు మహిళలంతా కలిసి ఏకంగా 4 కోట్లు తనకు ముట్టజెప్పారు.
వాళ్లకు అనుమానం రాకుండా ఉండేందుకు ముందు రెండు నెలల పాటు సమయానికి కమీషన్ ఇచ్చింది ఆ మహిళ. దీంతో అందరూ తనను నమ్మడం మొదలు పెట్టారు. చాలామంది ముందుకు వచ్చి డబ్బులు పెట్టసాగారు. రెండు నెలల తర్వాత కమీషన్ ఇవ్వడం మానేసింది.
అదేంటని అడిగితే.. మీరు డబ్బులు ఇచ్చినట్టు ఏవైనా ప్రూఫ్స్ ఉన్నాయా? అంటూ బెదిరించింది. దీంతో బాధితులంతా లబోదిబోమన్నారు. వెంటనే బాధితులు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి మొరపెట్టుకోగా.. ఆయన స్పందించి.. ఎస్పీ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు బండారం బయటపడింది.
వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. బిజినెస్ పేరుతో మహిళలను మోసం చేసిన ఆ యువతిని అరెస్ట్ చేశారు. అందరి దగ్గర వసూలు చేసిన డబ్బులతో సదరు మహిళ… కార్లు, బంగ్లాలు కొని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?