సెల్ఫీ.. సెల్ఫీ.. సెల్ఫీ.. దీని వల్ల ఇప్పటికే ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అయినా కూడా మనుషులు మాత్రం మారడం లేదు. ప్రమాదకరమైన ప్రదేశాల వద్దకు వెళ్లినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా… సెల్ఫీల పేరుతో ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. అటువంటి ఘటనలు ఎన్నో చూశాం మనం.. చూస్తూనే ఉన్నాం. అయినా కూడా మనుషుల తీరు మాత్రం మారడం లేదు.
తాజాగా ఓ మహిళ.. తన భర్త కళ్ల ముందే సెల్ఫీ తీసుకుంటూ డ్యామ్ లో పడి కొట్టుకుపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో చోటు చేసుకున్నది.
ఓ డాక్టర్, ఆయన భార్య.. ఎంపీలోని హలానీ డ్యామ్ కు సరదాగా గడుపుదామని వెళ్లారు. ఆ నిర్ణయమే వాళ్ల పాలిట శాపంగా మారింది. డ్యామ్ దగ్గరికి వెళ్లగానే ఇద్దరూ సెల్ ఫోన్లు తీసి తమ ఫోన్లలో సెల్ఫీలు తీసుకోవడం మొదలు పెట్టారు. డాక్టర్ భార్య.. డ్యామ్ ఒడ్డుకు చేరుకొని.. అక్కడ ఉన్న గోడ మీద కూర్చొని సెల్ఫీలు తీసుకోవడం మొదలు పెట్టింది. ఇంతలో బ్యాలెన్స్ తప్పింది. డ్యామ్ కింద ప్రవహిస్తున్న నీటిలో పడిపోయింది.
పక్కనే భర్త ఉన్నా కూడా తన భార్యను కాపాడుకోలేకపోయాడు. కిందపడుతూ భార్య అరవడంతో ఏం జరిగిందో చూసేలోపే ఆమె నీళ్లలో పడిపోయి కొట్టుకుపోయింది. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించినప్పటికీ.. తన ఆచూకీ తెలియలేదు. చివరకు తెల్లారి ఉదయం ఆమె మృతదేహం కనిపించింది.