గుర్తు తెలియని వ్యక్తులకు నగదు పంపించకూడదు.. అని పోలీసులు ఎంత చెబుతున్నా… కొందరు మాత్రం ఇంకా అలాంటి వారిని నమ్మి రూ. లక్షలకు లక్షలు మోసపోతూనే ఉన్నారు. తాజాగా మరో యువతి ఇలాగే మోసపోయింది. ఎన్ఆర్ఐ వరుడు కావాలనుకుని ఆమె ఓ మాట్రిమోనియల్ సైట్లో వెదికింది. ఆ క్రమంలో ఆమెకు ఎం.ఆశిష్ అనబడే ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను నెదర్లాండ్స్లో ఉంటానని తెలిపాడు. తరువాత అతని తల్లిగా చెప్పుకునే మోనికా మనీష్ అనే మరో మహిళ బాధితురాలిని కాంటాక్ట్ అయింది.
మోనికా మనీష్ తనను తాను ఆశిష్ తల్లిని అని పరిచయం చేసుకుంది. ఆశిష్ కూడా అదే విషయం బాధితురాలికి చెప్పాడు. దీంతో ఆ యువతి నిజమే అని నమ్మింది. మోనికా మనీష్ నెదర్లాండ్స్లోనే ఓ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నానని తెలిపింది. అయితే సంబంధం నచ్చిందని చెప్పి ఆ యువతి ఆ విషయం మాట్లాడేందుకు వారిని ఇండియాకు రావాలని కోరింది. దీంతో వారు సరేనని చెప్పారు. ఇక వారు ఆ యువతి ఉంటున్న బెంగళూరు నగరానికి వచ్చామని చెప్పారు. అయితే ఎయిర్పోర్టులో కస్టమ్స్ వారు తమను అరెస్టు చేశారని, డబ్బు కట్టకపోతే వారు విడిచిపెట్టరని ఆ ఇద్దరూ ఆ యువతితో చెప్పారు. దీంతో ఆ యువతి ఏమాత్రం ఆలోచించకుండా ఆ విషయం నిజమే అని నమ్మింది.
కాగా ఆ యువతి ఆ ఇద్దరికీ మొత్తం రూ.7,23,600ను పలు దఫాల్లో ట్రాన్స్ఫర్ చేసింది. అయితే ఆ తరువాత ఆ ఇద్దరూ ఫోన్ ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చిన యువతి పోలీసులను ఆశ్రయించింది. తాను మోసపోయానని ఆ యువతి ఆలస్యంగా గ్రహించింది. ఎయిర్పోర్టులో తాము ఉన్నామని, తమను కస్టమ్స్ వారు అరెస్టు చేశారని చెప్పగానే ఆమె విషయం విచారించకుండా, నిజానిజాలు తెలుసుకోకుండా.. గుడ్డిగా వారు అడిగినంత నగదు వారికి పంపింది. ఆ తరువాత నిజం తెలిసి బావురుమంది. ఇకనైనా ఇలాంటి మోసాలకు గురికావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ అపరిచితులకు నగదు పంపవద్దని సూచిస్తున్నారు.