అదృష్టం కలసి వస్తే అంతే.. పేదరికంలో ఉన్నవారు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారుతారు. అవును.. ఇలాంటి సంఘటనలను మనం గతంలో ఎన్నో చూశాం. తాజాగా ఇలాంటిదే మరొక సంఘటన చోటు చేసుకుంది. ఓ కార్మికుడికి గనిలో ఏకంగా 3 వజ్రాలు దొరికాయి. దీంతో అతను ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. అప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డ ఆ కార్మికుడు ఆ వజ్రాలు దొరికే సరికి ఒక్కసారిగా లక్షాధికారి అయ్యాడు. అతనికి పట్టరానంత సంతోషం కూడా కలిగింది.
మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో వజ్రాల గనిలో సుబాల్ అనే వ్యక్తి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తాజాగా అతను గనిలో తవ్వకాలు చేపట్టగా అతనికి ఏకంగా 3 వజ్రాలు దొరికాయి. దీంతో అతను వాటిని జిల్లా డైమండ్ అధికారి ఆర్కే పాండేకు ఇచ్చాడు. పాండే వాటిని పరీక్షించి అవి 7.5 క్యారెట్ల బరువుంటాయని తేల్చాడు. వాటి విలువ సుమారుగా రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఉంటుందని అన్నాడు.
కాగా ఆ మూడు వజ్రాలను ప్రభుత్వం వేలం వేయనుంది. అనంతరం వచ్చిన సొమ్ము నుంచి 12 శాతం నగదును ట్యాక్స్ రూపంలో తీసుకుంటారు. మిగిలిన మొత్తాన్ని ఆ కార్మికుడికి ఇస్తారు. ఇక ఇదే గనిలో ఇటీవలే మరొక కార్మికుడికి 10.69 క్యారెట్ల వజ్రం దొరికింది. దాన్ని కూడా వేలం వేసి అనంతరం వచ్చే సొమ్ములో పన్నులు పోగా మిగిలిన మొత్తాన్ని కార్మికుడికి ఇస్తామని గతంలోనే చెప్పారు. ఇక ఇప్పుడు సుబాల్ కూడా ఆ సొమ్మును పొందనున్నాడు.