న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్న భారతదేశానికి ప్రపంచ బ్యాంక్ మరో సారి భారీ సాయం ప్రకటించింది. భారత్కు ఒక బిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.7500 కోట్లు) అందిస్తున్నట్లు వెల్లడించింది. దేశంలోని వలస కార్మికుల, పట్టణ ప్రాంత పేదల సంక్షేమానికి ఈ నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపింది.
ప్రజారోగ్య పరిరక్షణ కోసం గతంలోనే భారత్ కు ఒక బిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించిన ప్రపంచ బ్యాంకు తాజాగా మరో బిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. నిన్న జరిగిన ప్రపంచ బ్యాంకు బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వరల్డ్ బ్యాంకు డైరెక్టర్ (భారత్) జునైద్ అహ్మద్ తెలిపారు.
దేశ వ్యాప్తంగా అమలవుతున్న 400కు పైగా సామాజిక భద్రతా పథకాలను సాంకేతికంగా సమీకృతం చేసే దిశగా ఈ నిధులను వినియోగించాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్తో కుదేలైన భారత్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి, చిన్నాభిన్నమైన పేద కుటుంబాలకు అండగా నిలవడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రకటించిన ‘ఆత్మ నిర్భర అభియాన్ భారత్’ పథకంపై ప్రపంచ బ్యాంకు ప్రశంసల జల్లు కురిపించింది.
‘ఆత్మ నిర్భర్ అభియాన్’ పథకం కింద నిర్వచించిన విధి విధానాలు చాలా కీలకంగా ఉన్నాయనీ, గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా, పట్టణ ప్రాంతాల్లోనూ పేదలకు సామాజిక భద్రతను అందించటంలో ఈ పథకం ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇటు ప్రజల ఆరోగ్యానికీ, అటు జీవనోపాధికి సమాన ప్రాముఖ్యం ఇస్తోందని జునైద్ అహ్మద్ అభినందించారు.