(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
జనవరి 21నుండి 25 వరకూ ఐదు రోజుల పాటు స్విడ్జర్లాండ్ దావోస్లో జరుగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సుకు భారత్ నుంచి 100 మంది ప్రతినిధుల బృందం హాజరుకానుంది. మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్ సహా ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య రాజకీయ, ప్రభుత్వ, పౌర సమాజానికి చెందిన మూడు వేల మంది ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఈ ప్రతిష్ఠాత్మక సదస్సులో మన దేశం నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, వాణిజ్య మంత్రి సురేశ్ ప్రభు, పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఏపీ సీఎం చంద్రబాబు, మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ పాల్గొనే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీ రామారావు, ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్, పంజాబ్ ఆర్థిక మంత్రి మన్ప్రీత్ బాదల్ కూడా హాజరవుతారని భావిస్తున్నారు. మన దేశం నుంచి హాజరయ్యే ప్రతినిధుల బృందంలో వ్యాపార దిగ్గజాలు అజిమ్ ప్రేమ్జీ, ఆయన కుమారుడు రిషద్, ముఖేశ్ అంబానీ దంపతులు, వారి కూతురు ఈశా, కుమారుడు ఆకాశ్, గౌతమ్ అదానీ, లక్ష్మి మిట్టల్, ఆనంద్ మహీంద్ర, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తదితరులు ఉంటారు. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పాల్గొనే అవకాశం ఉందని భావిస్తున్నారు.