ఢిల్లీ, జనవరి 26: ఒదిషాకు చెందిన ప్రముఖ రచయిత్రి, దర్శకురాలు గీతా మెహతా పద్మశ్రీ అవార్డును తిరస్కరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం సాహిత్య, విద్యా విభాగాల్లో ప్రతిభకు ఆమెను పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. ప్రస్తుతం న్యూయార్క్లో ఉంటున్న గీతా మెహతా తాను పద్మశ్రీ అవార్డును తిరస్కరిస్తున్నట్లు శనివారం పత్రికా ప్రకటనలో తెలిపారు. ‘భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు నేను అర్హురాలినని భావించినప్పటికీ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ అవార్డు తీసుకోవడం అపార్ధాలకు తావు ఇస్తుంది, ఇది ప్రభుత్వానికి, నాకు మంచిది కాదు’ అని గీతా మెహతా పేర్కొన్నారు. అవార్డు తిరస్కరిస్తున్నందుకు చింతిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.
గీతా మెహత ఒదిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోదరి.
భారతీయ పౌరురాలైన గీతా మెహతాను హోంమంత్రిత్వ శాఖ విదేశీయురాలిగా పేర్కొనడం గమనార్హం.
మెహతా రచయితగా పలు పుస్తకాల రాయడమే కాక పలు డాక్యుమెంటరీ చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.