WTC Final: మరొక రెండు రోజుల్లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది. రెండు సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేటి జట్లతో టెస్ట్ సిరీస్ ఆడి, పోరాడి, గెలిచి తుది సమరానికి అర్హత సాధించిన ఈ రెండు జట్లలోని 11మంది ప్లేయర్లు కీలకమైన ఆటగాళ్లే. ఇక ఎవరి బలాలు వారివి. ఏ జట్టునీ తక్కువగా చేయడానికి లేదు అలాగని…. ఎవరినీ ఖచ్చితమైన విజేత అని చెప్పడానికీ లేదు.
క్రికెట్ ప్రేమికులకు మాత్రం అయిదు రోజుల థ్రిల్లింగ్ వినోదాన్ని అందించేందుకు మాత్రం ఇరు జట్ల లోని ఆటగాళ్లు సిద్ధమయ్యారు. రెండు జట్లలో ఎనిమిది ప్రధాన ఆటగాళ్లు మధ్య పోరాటం నెలకొంది. మొదటి పోరాటం విషయానికి వస్తే ఇప్పటి వరకు ప్రపంచంలో మూడు ఫార్మెట్ లలో మేటీ బ్యాట్స్మెన్ ఎవరు అన్న విషయంపై చర్చ జరుగుతూ ఉంటుంది.
అందులో అత్యధిక శాతం మంది విరాట్ కోహ్లీ పేరు చెప్తే… రెండో స్థానంలో ఉన్న కేన్ విలియమ్సన్ పేరు కూడా కోహ్లీ తర్వాత అత్యధికంగా చెప్పేవారు ఉన్నారు. ఇక ఈ ఫైనల్లో వీరిద్దరిలో ఎవరు అత్యధిక స్కోరు సాధిస్తారు అన్న విషయంపై అనేక అంచనాలు ఉన్నాయి.
అలాగే రోహిత్ శర్మ, ట్రెంట్ బౌల్ట్ మధ్య జరగబోయే సమరం కూడా ఆసక్తికరంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత ఓపెనర్ పైకి కొత్త బంతితో దూసుకొచ్చే బౌల్ట్ అతనిని విపరీతంగా ఇబ్బంది పెడతాడు. ఇప్పటికే ఎన్నోసార్లు బౌల్ట్ బౌలింగ్ లో హిట్ మ్యాన్ అవుట్ అయిన సందర్భాలు ఉన్నాయి. మరి వీరిద్దరిలో ఎవరు ఎవరు ఎవరి మీద పై చేయి సాధిస్తారో చూడాలి.
ఇకపోతే భారత బ్యాటింగ్ లైనప్ కు వెన్నుముక్క అయినా చటేశ్వర్ పుజారా ను కివీస్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ నీల్ వాగ్నర్ విపరీతంగా ఇబ్బంది పెట్టవచ్చు. వైవిధ్య యాక్షన్ ఉన్న వాగ్నర్ ను కు ఎదుర్కునేందుకు పుజారాకి కొద్దిగా కష్టం అవుతుంది. అలాగే భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యువ కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వాయ్ మధ్య పోరు కూడా ఆసక్తికరంగా ఉంటుంది.
లెఫ్ట్ హ్యాండర్ లకు టెస్టుల్లో బుమ్రా అతి కష్టమైన బంతులు వేస్తుంటాడు. అతని బంతులని సరిగ్గా ఆడే మాట పక్కన పెడితే కనీసం ధైర్యంగా వదిలేసేందుకు కూడా ఎంతో టెక్నిక్ కావాలి. మరి ఈ ఎనిమిది మంది ఆటగాళ్ళ మధ్య నాలుగు మినీ సమరాలు ప్రజలను ఎంత వరకు మంత్రముగ్ధులను చేస్తాయో చూడాలి..!