WTC Final: క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటి టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ ను ఆస్వాదించాలనుకున్న క్రికెట్ అభిమానులకు వర్షం పెద్ద అడ్డుకట్టగా మారింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ నాలుగో రోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ నాలుగు రోజులలో రెండు రోజులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా మిగిలిన రెండు రోజుల్లో కూడా వెలుతురు సరిగ్గా లేని కారణంగా పూర్తిస్థాయిలో ఆట జరగలేదు.
ఇక నాలుగో రోజు ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండు వికెట్ల నష్టానికి 101 పరుగులు సాధించింది. మొదటి ఇన్నింగ్స్లో ఇండియా 217 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కాబట్టి ఆరవ రోజుని రిజర్వ్ డే గా ఐసిసి ముందే ప్రకటించింది. న్యూజిలాండ్ తన మొదటి ఇన్నింగ్స్లో ఎంతో పటిష్టమైన స్థితిలో ఉంది.
ఒక దశలో మూడవ రోజంతా కూడా కివీస్ ఓపెనర్లు తమ విక్కెట్లు ఇచ్చే లాగా కనిపించలేదు అయితే ఆట చివర్లో పెవిలియన్ చేరడంతో భారత్ కు కొద్దిగా ఆశలు రేగాయి. అయితే ఇప్పుడు ఎనిమిది వికెట్లు చేతిలో ఉండడం కేవలం 116 పరుగులు మాత్రమే న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో భారత్ కంటే వెనుకబడి ఉండడంతో వారే ఫేవరెట్ అని చెప్పాలి.
అయితే ఒక స్థితిలో భారత్ కూడా న్యూజిలాండ్ లాగానే పటిష్టంగా కనిపించింది కానీ త్వరగా వరుసగా వికెట్లను చేజార్చుకుంది. కాబట్టి వర్షం పడటం కారణంగా ఎవరు లాభపడ్డారు అంటే సరిగ్గా చెప్పలేని పరిస్థితి. టీమిండియా వర్షం పడకపోయి ఉంటే న్యూజిలాండ్ ను కూడా తమ స్కోర్ కి దగ్గరలోనే ఆలౌట్ చేసేవారమని భావిస్తూ ఉండవచ్చు.
న్యూజిలాండ్ కూడా ఇక్కడి నుండి మ్యాచ్ పై మరింత పట్టు సాధించి భారత్ ను ఒత్తిడి లో నెట్టేసేవారమని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఒకరకంగా వర్షం వల్ల భారత సంక్లిష్ట పరిస్థితుల నుండి బయటపడే అవకాశం ఉన్నప్పటికీ కోహ్లీసేన ఏ దశలోనూ డ్రా అనే పదం వినడానికి ఇష్టపడదు అన్నదీ తెలిసిందే. కాబట్టి రెండు రోజులు ఈ ఆటలో కొన్ని అద్భుతాలు చూడవచ్చు.