న్యాయ వ్యవస్థకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మధ్య ఘర్షణ కొనసాగుతూనే ఉంది. సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణ పై అవినీతి ఆరోపణలు చేస్తూ వైసిపి అధినేత ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చీఫ్ జస్టిస్ కి లేఖ రాయడం తెలిసిందే.
అంతకుముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న కోర్టు తీర్పులపై పలువురు వైసిపి నేతలు ,ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు జడ్జీలను దుమ్మెత్తిపోయడం విదితమే.ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరుగుతోంది.ఇదిలా ఉండగానే న్యాయమూర్తులపై వైసిపి ఎమ్మెల్యే ఒకరు నోరు పారేసుకున్నారు.వారు అవినీతిపరులు అన్నట్లు వ్యాఖ్యలు చేశారు.టీడీపీ అధినేత చంద్రబాబు తొత్తులు అన్న భావం వచ్చేలా కామెంట్లు విసిరారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం తగ్గువారిపల్లె పంచాయతీ పరిధిలో ఇళ్ల పట్టాల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని కొందరు హైకోర్టును ఆశ్రయించారు.
వారి పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు విచారణ పూర్తయ్యే వరకు పట్టాల పంపిణీ నిలిపివేయాలని ఆదేశిస్తూ స్టే ఇచ్చింది.దీంతో పూతలపట్టు వైసిపి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు రెచ్చిపోయారు.ఈ స్టే ఇచ్చిన న్యాయమూర్తుల పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో వైసీపీ వ్యవహార శైలి న్యాయకోవిదులకు కూడా అంతుపట్టడం లేదు.గతంలో ఎన్నడూ లేని భిన్నమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కనిపిస్తోంది.సాధారణంగా కేసు మెరిట్స్ ను బట్టి న్యాయమూర్తులు నిర్ణయం తీసుకుంటారు.పిటిషన్ లో ఉన్న పాయింట్లను బట్టి స్టే ఇవ్వడం లాంటివి జరుగుతుంటాయి.
కొన్నిసార్లు ప్రభుత్వానికి తీర్పులు వ్యతిరేకంగా ఉండవచ్చు.అంతమాత్రాన న్యాయమూర్తులకు అవినీతి రాజకీయ ఉద్దేశాలు అంటగడుతూ వైసిపి నేతలు చేస్తున్న బహిరంగ విమర్శలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ న్యాయకోవిదులు వ్యాఖ్యానిస్తున్నారు.ఇది న్యాయవ్యవస్థను కించపరచడమేనన్నారు.మరి కోర్టులకు వైసీపీకి మధ్య సాగుతున్న ఘర్షణ ఎక్కడిదాకా వెళ్తుందో?కాగా యథాప్రకారం టీడీపీ ఈ విషయంలో వైసిపి నేతల వైఖరిని ఖండిస్తూ వెంటనే సోషల్ మీడియాలో వార్ మొదలెట్టింది.’న్యాయస్థానాలపైనా, న్యాయమూర్తులపైనా వైకాపా దాడులు సాగుతూనే వున్నాయి. తాజాగా వైకాపా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్బాబు జడ్జిలు అవినీతిపరులంటూ వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగవ్యవస్థలపై జగన్రెడ్డి ఆలోచనకు అద్దంపడుతోందని’ టిడిపి తన ఫేస్బుక్లో సోమవారం పోస్టింగ్ పెట్టింది.మరి ఉన్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి!