అమరావతి, ఏప్రిల్ 28: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిధి దాటి వ్యవహరిస్తుంటే ఈసి ఏం చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణకే ప్రస్తుత సీఎస్ పరిమితమని ఆయన అన్నారు.
ఫాని తుఫాను రాష్ట్రానికి నష్టం చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారని యనమల ప్రశ్నించారు. సిఎస్, ఎన్నికల సంఘం బాధ్యత వహిస్తుందా అని యనమల ప్రశ్నించారు. కేంద్రంలో ఎక్కడా కేబినెట్ సెక్రటరీ జోక్యం చేసుకోవడం లేదనీ ఆంధ్రప్రధేశ్ లో ఈ సి నియమించిన సిఎస్ సుబ్రమణ్యం జోక్యం చేసుకుంటున్నారని అన్నారు.
పోలవలరం ప్రాజెక్టు పనులు ప్రారంభించింది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమేననీ దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రజా ప్రభుత్వంపైనే ఉందని యనమల పేర్కొన్నారు. పనులు సమీక్షించకుంటే సకాలంలో పనులు పూర్తి కావని, జాప్యం జరిగితే నిర్మాణ వ్యయం కూడా పెరుగుతుందని యనమల అభిప్రాయం వ్యక్తం చేశారు.
బ్యూరోక్రాట్లు రాజ్యం చేయవచ్చని ఎక్కడైనా చెప్పారా అని యనమల నిలదీశారు. రాజ్యాంగం కంటే ఎన్నికల నియమావళి గొప్పా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి భంగం కలిగేలా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఇసి విడుదల చేయవచ్చనా అని యనమల ప్రశ్నించారు.
కేంద్రంలోని మోది నాయకత్వంలోని ప్రభుత్వానికి ఎలాంటి ఆంక్షలు లేవనీ, కేంద్ర క్యాబినెట్ సమావేశాలు చేస్తున్నాయనీ, నిర్ణయాలు తీసుకుంటున్నాయని యనమల అన్నారు. బిజెపీయేతర ప్రభుత్వాలను పని చేయనివ్వకుండా చేస్తున్నారని యనమల ఆరోపించారు.