కరోనా కష్టకాలంలో కూడా జగన్ అవిరామంగా సంక్షేమపథకాలు అమలుచేసుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలోని కొన్ని పథకాలకు జగన్ పేర్లు మర్చుకున్నారని.. అదే క్రమంలో గడిచిన 14నెలల్లో సుమారు రూ.18,026 కోట్ల విలువైన సంక్షేమ పథకాలను రద్దుచేశారని ఆరోపిస్తున్నారు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు!
రాష్ట్రాన్ని వైసీపీ రాక్షస మాయ కమ్మేసిందని తాజాగా మొదలుపెట్టిన యనమల రామకృష్ణుడు… సీఎం జగన్ పథకాలన్నీ మాయ పేలాలే అని ఆరోపిస్తున్నారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు ఎత్తుకున్న యనమల… గత ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమంలో భాగంగా… 2018-19లో రూ.6,419 కోట్లు వ్యయం చేసిందని… 2019-20లో వైసీపీ రూ.3,382 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఆరోపించారు.
పాత పథకాలను నవరత్నాల్లో కలిపేశారని.. “అన్నదాత సుఖీభవ” పథకాన్ని రైతు భరోసాలో కలిపినట్లుగానే.. అమ్మఒడిలో ఇంకొన్ని పథకాలు కలిపేశారని ఆయన విమర్శించారు. పసుపు-కుంకుమ, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫి, పండుగ కానుకలు, పెళ్లి కానుకలు, విదేశీ విద్య, చంద్రన్న బీమా తదితర పథకాలను రద్దుచేశారని యనమల మండిపడుతున్నారు. ఈ క్రమంలో యనమల ఆరోపణలు అలా ఉంటే… వీటికి కౌటర్స్ వేయడం మొదలుపెట్టింది అధికార పార్టీ!
ఎన్నికల ఏడాది కావడంతో 2018 – 19 లో నిధులు ఎక్కువగా కేటాయించారని… బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమంపై నిజంగా గత టీడీపీకి అంత చిత్తశుద్ధి ఉన్నమాటే వాస్తవమైతే… 2014 నుంచి లెక్కలు తీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల ఏడాదిలోనే టీడీపీకి ఎస్సీ, బీసీలు గుర్తుకువస్తారని అంటున్నారు.
మరి వైకాపా నుంచి వస్తున్న ఈ విమర్శలపై యనమల పెద్దమనిషిగా స్పందించి… 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ… ఆ వర్గాలపై ఎంతెంత నిధులు కేటాయించారు.. మరింకెంత నిధులు ఖర్చు చేశారనేదానిపై క్లారిటీ ఇస్తారా లేక… వైకాపా చేస్తున్న విమర్శలు సరైనవే అంటూ మౌనాన్ని పాటిస్తారా అనేది వేచి చూడాలి!