జమ్ము కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ ఢిల్లీలోని తీహార్ జైలులో తన సెల్ లో నిరాహార దీక్ష చేపట్టారు. తన కేసులను సక్రమంగా విచారణ చేయడం లేదని ఆరోపిస్తూ యాసిన్ మాలిక్ నిరాహార దీక్ష చేస్తున్నారు. జైలు అధికారులు ఆయనతో మాట్లాడి నిరాహర దీక్ష విరమణకు ప్రయత్నించారు. కానీ యాసిన్ మాలిక్ తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు.
జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారన్న అభియోగంపై 2019 ఏప్లిల్ నెలలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) యాసిన్ మాలిక్ ను అరెస్టు చేసింది. యాసిన్ మాలిక్ పై మరి కొన్ని కేసులు ఉన్నాయి. అయితే కశ్మీర్ ఉగ్రవాద కార్యక్రమాలకు నిధులు సమకూర్చారన్న అభియోగాలకు సంబంధించి కేసులో నేరాన్ని కోర్టులో అంగీకరించారు. మే 19న ఢిల్లీలోని ఎన్ఐఏ కోర్టు యాసిన్ మాలిక్ ను దోషిగా నిర్దారించింది. మే 25న యాసిన్ మాలిక్ కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.