(అమరావతి నుండి ‘న్యూస్ ఆర్బిట్ ‘ప్రతినిధి)
రాజకీయాలు ఎప్పుడు స్థిరంగా ఉండవు. పరిస్థితులకు అనుగుణంగా మారుతుంటాయి. రాజకీయ పార్టీలు తమ తమ అవసరాలకు అనుగుణంగా ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటుంటారు. అవసరాలు తీరి పోయిన తరువాతో ఇంకా ఏదో సందర్భాలలోనో విబేధాలు, తేడాలు వస్తే పొత్తులకు కటీఫ్ చెబుతుంటారు. ఈ రకమైన పరిణామాలు అనేక సందర్భాల్లో చూశాం. ఇప్పుడు కేంద్రంలోని ఎన్ డీ ఎకి వైసీపీతో అవసరం ఉంది. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో వైసీపీకి అవసరం దీంతో ఉభయ కుసలో పరిగా ఎన్ డీ ఎలోకి వైసీపీలోకి చేరబోతున్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నడుస్తున్నది. ఇదే గనుక జరిగితే ఆ ఎంపి పరిస్థితి ఏమిటి. కుడితిలో పడిన ఎలుక సామెత అయినట్లేనా.
ఆ రాజు గారి పరిస్థితి ఏమిటి..?
వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు గత కొంత కాలంగా వైసీీపీపైనా, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి పైనా, ప్రభుత్వ విధానాలపైనా తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదంతా ఆయనకు కేంద్రంలోని బీజెపి పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండటం వల్లనే ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిపై, పార్టీ అధినేతపై ఇష్టానురీతిలో విమర్శలు చేస్తూ వస్తున్నారనేది అందరూ అనుకుంటున్న మాట. ఒక వేళ వైసీపీ సస్పెండ్ చేస్తూ వెంటనే కాషాయ జెండా కప్పుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారంటూ కూడా వార్తలు షికారు చేశాయి. ఆ రాజు గారి ప్రవర్తనపై విసిగి వేశారిన వైసీపీ ఎలాగైనా సరే ఆయనను పార్టీ నుండే కాదు పార్లమెంట్ నుండే పంపించేయాలని కంకణం కట్టుకుంది. ఆ క్రమంలో భాగంగానే గతంలోనే లోక్ సభ స్పీకర్ ఓం బిల్లాకు ఆ రాజుగారిపై అనర్హత వేటు వేయాలంటూ ఫిర్యాదు అందజేశారు.
ఒక దెబ్బకు మూడు పిట్టలు
ఒక వేళ కేంద్రంలోని ఎన్ డీ ఎలోకి వైసీపీ చేరితే ఒక దెబ్బకు మూడు పిట్టలు రాలినట్లు అవుతుంది. రాష్ట్రంలోని టీడీపీకి దారులు కట్ చేసినట్లు అవుతుంది ఒకటి. రెండు రాజు గారి నోటికి కళ్లెం పడుతుంది. మూడు వైసీపీ విధానాలను మొదటి నుండి వ్యతిరేకిస్తూ ప్రస్తుతం బీజేపితో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చెప్పినట్లు అవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ పరిణామమే జరిగితే..జనసేనకు బీజెపి పొమ్మనలేక పొగబెట్టినట్లే అవుతుంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఒక వారం రోజులు ఓపిక పడితే ఎన్ డి ఎలోకి వైసీపీ చేరుతుందాా లేదా అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.