గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ మజ్లిస్ ప్రధానంగా పోటీ పడుతుండగా పైకి కనిపించని నాలుగో సింహం పాత్రను వైసిపి పోషించనున్నదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
నిజానికి వైసిపి కి తెలంగాణలో బలం ఉంది.2014 ఎన్నికల్లో ఆ పార్టీ ఖమ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలను ఖమ్మం లోక్సభ నియోజకవర్గాని గెలుచుకుంది.తదుపరి పరిణామాల్లో తెలంగాణ నుండి వైసిపి మాయమైనట్లు కనిపిస్తున్నప్పటికీ ..దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో తెలంగాణ జిల్లాల్లో ఉన్నారు.రాజశేఖరరెడ్డి మరణించినప్పుడు గుండె పగిలి మృతిచెందిన వారిలో అత్యధికులు తెలంగాణవారే అంటే అతిశయోక్తి కాదు.ఈ నేపథ్యంలో వైసిపి కాకున్నప్పటికీ వైఎస్సార్ అభిమానులు గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తారనే విషయమై చర్చ జరుగుతుండగా వారు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశముందని వినవస్తోంది.
ఇప్పటి వరకు రాజకీయంగా నిద్రాణమైఉన్నట్లు కనిపిస్తున వైసిపి వైఎస్సార్ అభిమానులు ఇప్పుడు సంఘటిత శక్తిగా తయారయ్యారట. బిజెపికి ఇక్కడ తాము గనుక మద్దతిచ్చి గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో ఆ పార్టీ విజయానికి దోహద పడినట్లయితే కమలనాథులు వెంటనే ఆంధ్రప్రదేశ్పై ఫోకస్ చేస్తారని,త్వరలో జరగనున్న తిరుపతి లోక్సభ ఉప ఎన్నికపై ఈ ప్రభావం ఉంటుందని వారు అంచనా వేస్తున్నారట. అంతేగాక సమయం సందర్భం లేకుండా దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్రావు అకారణంగా వైఎస్సార్ మరణం పై వ్యాఖ్యలు చేయడాన్ని వారు జీర్ణించుకోలేకున్నారు. ఈ కారణంగానే మెజారిటీ వైఎస్సార్ అభిమానులు బిజెపికి దూరంగా జరిగారని సమాచారం.
అదే సమయంలో తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరంలో ఆంధ్రప్రదేశ్ సెటిలర్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో టిడిపి కోలుకోలేని దెబ్బ తినాలంటే టీఆర్ఎస్ కే మద్దతు ఇవ్వడం మంచిదని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీకి మద్దతిస్తున్న సామాజికవర్గం హడావుడి అనేక డివిజన్లో స్పష్టంగా కనిపిస్తుండడాన్ని వారు జీర్ణించుకోలేకున్నారు.జగన్ కేసీఆర్లిద్దరికీ కూడా చంద్రబాబే ప్రధాన శత్రువు.చంద్రబాబుకు మరోసారి షాక్ యివ్వాలంటే అది కేసీఆర్ ద్వారానే సాధ్యమవుతుందని వైఎస్సార్ అభిమానులు నమ్ముతున్నారు.ఈ నేపథ్యంలో వైసిపి లేదా వైఎస్సార్ అభిమానుల ఓట్లు టీఆర్ఎస్కు గంపగుత్తగా పడవచ్చునని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.