(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
విశాఖపట్నం: విశాఖ రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి, వైసిపి నేత దాడి వీరభద్రరావు అన్నారు. ఎన్టిఆర్ ప్రాజెక్టులను చంద్రబాబు నిర్వీర్యం చేశారని దాడి ఆరోపించారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర అని ఆయన అన్నారు. విశాఖ అంటే చంద్రబాబుకు ఎందుకంత కోపమో అర్థం కావడం లేదని అన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధిని చంద్రబాబు కోరుకోవడం లేదని విమర్శించారు.
ఈవెంట్ల కోసమే విశాఖను చంద్రబాబు వాడుకున్నారని అన్నారు. మూడు రాజధానులపై చంద్రబాబు విషపూరిత ప్రచారం చేస్తున్నారనీ, అధికారం లేకపోతే బాబు ఉండలేరనీ దాడి విమర్శించారు.ఎన్టిఆర్ కుమార్తెలు కూడా రాజధాని అమరావతిలోనే కోరుకుంటున్నారని దాడి అన్నారు. .
విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతోందనీ, విశాఖకు జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనీ పేర్కొన్నారు. విశాఖ రాజధాని అవుతుందో లేదో తనకు తెలియదనీ, అయితే హై పవర్ కమిటీ నివేదిక తర్వాతే ఒక స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు. విశాఖకు ఎవరూ అన్యాయం చేయవద్దని దాడి విజ్ఞప్తి చేశారు.