అమరావతి: టిడిడి చైర్మన్ పదవి స్వీకరించేందుకు వైసిపి సీనియర్ నేత, మాజీ పార్లమెంట్ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అంగీకరించినట్లు కనబడుతోంది. ఆయన క్రైస్తవుడు అంటూ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన నేడు స్పందించారు. తాను నూరు శాతం హిందువునని, తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి తమ ఇష్ట దైవమని వైవి తెలియజేశారు.
అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పేరును టిటిడి పదవి కోసం పరిశీలనలోకి తీసుకోగానే కొందరు గిట్టనివారు తాను క్రిస్టియన్ అంటూ తప్పుడు ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల్లో మొదలు పెట్టారని సుబ్బారెడ్డి విమర్శించారు. తాను హిందువును కాదన్న విషయంలో అనుమానాలే అక్కరలేదని వైవి అన్నారు.
టిటిడి చైర్మన్గా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తనకు అవకాశం ఇచ్చారనీ, దైవ సేవకు పంపుతున్నందున తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటానని సుబ్బారెడ్డి తెలిపారు.
టిటిడినే కాదు భవిష్యత్తులో పార్టీ ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తానని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
టిటిడి బాధ్యతలు చేపట్టిన తరువాత ముఖ్యంగా స్వామివారి ఆస్తులు, ఆభరణాల విషయంలో వాస్తవాలు రాబడతామని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.