డిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు జరిగే అవకాశం ఉందని వైసిపి భావిస్తోంది. చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ జరుగనున్న గ్రామాలలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైసిపి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అక్కడ టిడిపి శ్రేణులు అడ్డుకున్నారు. ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడటంతో టిడిపి, వైసిపి అభ్యర్థులను అరెస్టు చేసి స్టేషన్కు కూడా తరలించారు.
ఈ నేపథ్యంలో రీ పోలింగ్, కౌంటింగ్ సందర్భాలలో టిడిపి అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని వైసిపి భయపడుతోంది.
అల్లరలు జరిగే అవకాశం ఉన్నందున రీపోలింగ్, కౌంటింగ్ సందర్భంలో భద్రత పెంచాలని ఎన్నికల సంఘాన్ని వైసిపి నేతల బృందం కోరింది, ఈ మేరకు వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నేతృత్వంలో పార్టీ నేతల బృందం శనివారం ఎన్నికల సంఘాన్ని కలిసి వినతి పత్రం సమర్పించింది.
కౌంటింగ్ రోజు టిడిపి అలజడులు సృష్టించే అవకాశం ఉన్నందున సమస్యాత్మక నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ సెంటర్లలో అదనపు పోలీస్ బలగాలను కేటాయించాలని వినతి పత్రంలో కోరారు.
కౌంటింగ్ ప్రక్రియ స్వేచ్చగా, పారదర్శకంగా జరిగేలా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
వైసిపి నేతల బృందంలో ప్రభాకరరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాజమోహనరెడ్డి, బుట్టా రేణుక, బొత్సా సత్యనారాయణ, రవీంద్రబాబు, ఆకుల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు కేంద్రాల్లో ఈ నెల 19న రీపోలింగ్ జరుగుతోంది.